సోషల్ మీడియా వలన ఉపయోగాలతో పాటు నష్టాలు ఎలా ఉంటాయో చెప్పడానికి మహిళా యూట్యూబర్ రచనా గుర్జర్ వ్యవహారం నిదర్శనంగా నిలిచింది. మధ్యప్రదేశ్ లోని, ఖైద్వా గ్రామానికి చెందిన యూట్యూబర్ రచనా గుర్జర్ సోషల్ మీడియాలో తన నగల వీడియోలను షేర్ చేసి చిక్కుల్లో పడ్డారు. రచన గుజ్జార్ కు సోషల్ మీడియాలో రీల్స్ చేసి పెట్టడం సరదా. రెగ్యూలర్ గా ఆమె లైఫ్ స్టైల్ వీడియోలు చేస్తుండేది. ఖరీదైన చీరలు.. ఒంటినిండా నగలు వేసుకొని.. చేతిలో తన ఐ ఫోన్ చూపిస్తూ రీల్స్ చేసి పెట్టేది. గత మూడు రోజుల క్రితం కూడా కొత్త నగలు వేసుకొని వీడియోలు చేసింది. ఇంకేముంది దొంగలకు ఈ వీడియోనే బెస్ట్ ఛాయిస్ గా కనిపించింది. రచనా గుర్జర్ నగల రీల్స్ వీడియో చేసిన రోజు రాత్రి ఓ ఫంక్షన్ కి వెళ్లింది.

ఇంటికి వచ్చిచూసే సరికి ఇంట్లోని నగలన్నీ దొంగలు చోరీ చేశారు. రూ. 6లక్షల విలువైన బంగారు ఆభరణాలతో పాటుగా రూ. 1.91 లక్షల నగదు కూడా ఎత్తుకెళ్లిపోయారు. వెళ్తూ వెళ్తూ ఇంట్లోని ఎనర్జీ డ్రింక్స్ కూడా ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పాపం ఇప్పుడు యూట్యూబర్ రచనా గుర్జర్ తన రీల్స్ పిచ్చి తనను ఎంతగా ముంచేసిందోనంటూ లబోదిబోమని వాపోతుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు సోషల్ మీడియాలో ఇలాంటి ఆస్తులు, నగల ప్రదర్శనల రీల్స్ పెట్టవద్దని హెచ్చరిస్తున్నారు.