Mukhtar Ansari : ఉత్తర్ప్రదేశ్కు చెందిన గ్యాంగ్స్టర్, సమాజ్వాదీ పార్టీ నేత ముఖ్తార్ అన్సారీ (63) గుండెపోటు వచ్చింది. బందా జైల్లో ఉన్న ఆయనను ఆస్పత్రికి తరలించేలోపే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. బీజేపీ ఎమ్మెల్యే హత్య కేసులో దోషిగా తేలడంతో అన్సారీ 2005 నుంచి జైల్లోనే ఉన్నాడు.
అన్సారీ మృతిపై వైద్యులు మెడికల్ బులెటిన్ విడుదల చేశారు. గురువారం రాత్రి 8.25 గంటల సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారని పేర్కొన్నారు. వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిన అన్సారీని జైలు అధికారుల చికిత్స కోసం దుర్గావతి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకొచ్చారని.. తొమ్మిది మంది వైద్యుల బృందం చికిత్స ప్రారంభించిందని తెలిపారు. చికిత్స కొనసాగుతుండగానే అన్సారీ గుండెపోటుతో మరణించారని వైద్యులు ప్రకటించారు.
కాగా, అన్సారీ మరణంపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఆయనపై జైలులో విషప్రయోగం జరిగిందని అన్సారీ సోదరుడు, ఘాజీపూర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ అన్నారు. బందా జైలు సిబ్బంది స్లో పాయిజనింగ్ చేసి చంపేశారని ఆరోపించారు. కాగా, అన్సారీ మృతితో ఆస్పత్రి పరిసరాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్తర్ప్రదేశ్లో 144 సెక్షన్ విధించారు. బందా, ఘాజీపూర్, వారణాసి జిల్లాల్లో పోలీసులు, అదనపు బలగాలను మోహరించినట్లు రాష్ట్ర డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.
యూపీలోని మౌ ఏరియాకు చెందిన ముఖ్తార్ అన్సారీపై 61 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాటిలో 15 కేసులు హత్యలకు సంబంధించినవే. 1980లో నేరాలు మొదలుపెట్టిన అన్సారీ.. 90వ దశకంలో సొంతంగా ముఠాను ఏర్పాటు చేశాడు. మౌ, ఘాజీపూర్, వారణాసి ప్రాంతాల్లో ఇతని ముఠాలు దోపిడీలు, కిడ్నాప్లు వంటి దారుణాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా 2004లో అన్సారీ వద్ద మెషిన్ గన్ను గుర్తించిన పోలీసులు.. ఉగ్రవాద నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో 2023 ఏప్రిల్లో న్యాయస్థానం అన్సారీకి పదేళ్ల జైలు శిక్ష విధించింది. 1990ల నాటి నకిలీ తుపాకీ లైసెన్స్ కలిగి ఉన్నారన్న కేసులో కూడా అభియోగాలు రుజువు కావడంతో ఈ నెల 13న కోర్టు అన్సారీకి జీవితఖైదు ఖరారు చేసింది. కాగా అన్సారీ ఐదుసార్లు మౌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. రెండు సార్లు బీఎస్పీ తరఫున పోటీ చేశాడు. అన్సారీ మృతిపై సమాజ్వాదీ పార్టీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.