మోదీ పర్యటన..భారత్ కు చోళుల రాగి శాసనాలను తిరిగిచ్చేసిన నెదర్లాండ్

నెదర్లాండ్స్ పర్యటనలో ప్రధాని మోదీకి చోళుల కాలానికి చెందిన అరుదైన రాగి శాసనాలను డచ్ ప్రభుత్వం తిరిగి అప్పగించింది. భారత్ స్టార్టప్, సెమీకండక్టర్ పురోగతిని మోదీ ప్రస్తావించారు.

ప్రధాని నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ పర్యటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ పర్యటన సందర్భంగా, నెదర్లాండ్స్ 11వ శతాబ్దానికి చెందిన ‘అనైమంగళం రాగి శాసనాలను’ భారతదేశానికి తిరిగి ఇచ్చింది. ఇది ఒక ముఖ్యమైన సాంస్కృతిక పరిణామంగా ఇరుదేశాలు అభివర్ణించాయి. స్థానికంగా ‘లైడెన్ శాసనాలు’గా పిలువబడే ఈ కళాఖండం మొదటి రాజ రాజ చోళుని (క్రీ.శ. 985–1014) పాలనా కాలానికి చెందినది.

సుమారు 30 కిలోల బరువున్న 21 పెద్ద, 3 చిన్న ఫలకలతో కూడిన ఈ రాగి శాసనాలు రెండు విభాగాలుగా ఉన్నాయి. ఒక విభాగం తమిళంలో ఉండగా, మరొకటి సంస్కృతంలో ఉంది. రాజేంద్ర చోళుని ముద్ర ఉన్న కంచు ఉంగరంతో కలిపి ఉంచబడ్డాయి. ‘అనైమంగళం రాగి పలకలు’గా కూడా పిలిచే ఈ శాసన సమూహం రాజేంద్ర చోళ మహారాజు జారీ చేశార. నాగపట్టణం సమీపంలోని అనైమంగళం గ్రామాన్ని ఒక బౌద్ధ విహారాన్ని నిర్మించడం కోసం శ్రీవిజయ రాజ్యానికి చెందిన శ్రీమార విజయోత్తుంగవర్మన్‌కు తన తండ్రి రాజరాజ చోళుడు దానంగా ఇచ్చిన వృత్తాంతాన్ని ఈ శాసనాలు వివరిస్తాయి.

మధ్యయుగ కాలంలో దక్షిణ భారతదేశం, ఆగ్నేయాసియా మధ్య జరిగిన సముద్ర వాణిజ్యం, సాంస్కృతిక మార్పిడి, మత బాహుళ్యానికి సంబంధించిన కీలకమైన ఆధారాలుగా చరిత్రకారులు ఈ రాగి శాసనాలను పరిగణిస్తారు. చారిత్రాక కళాఖండాల ఒప్పందంలో భాగంగా భారత్ కు విలువైన చోళుల రాగి శాసనాలను తిరిగి అప్పగించి డచ్ ప్రభుత్వానికి, ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ రాజ శాసనంలో 21 రాగి ఫలకాలతో ఇది నెదర్లాండ్స్‌లోని లైడెన్ విశ్వవిద్యాలయంలో భద్రపరచబడింది. ఈ ఫలకాలను దేశానికి తిరిగి తీసుకురావడానికి భారత ప్రభుత్వం కొన్ని సంవత్సరాల క్రితం ద్వైపాక్షిక చర్చలను ప్రారంభించింది.

నెదర్లాండ్స్ భారతీయ ప్రవాసులను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. కరోనా మహమ్మారి, యుద్ధాలు, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఐక్య కార్యాచరణకు పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే, దశాబ్దాల ఆర్థిక ప్రగతి నాశనమై, అసంఖ్యాక ప్రజలు పేదరికంలోకి నెట్టబడతారని ఆయన హెచ్చరించారు. పశ్చిమా సంక్షోభ పరిస్థితి మారకపోతే, దశాబ్దాలుగా సాధించిన ప్రగతి అంతా నాశనమవుతుంది అని మోదీ అన్నారు. ప్రపంచ జనాభాలో అత్యధిక వర్గం పేదరికపు ఉచ్చులో చిక్కుకోవచ్చు అని ఆందోళన వ్యక్తం చేశారు.

అయినప్పటికీ భారతదేశం ఆర్థిక ప్రగతిపై ఆశావాదం ముందుకెళుతుందని, దశాబ్దం క్రితం కేవలం 500 సంస్థలతో పోలిస్తే, 2 లక్షలకు పైగా క్రియాశీలక స్టార్టప్‌లతో భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థగా ఆవిర్భవించిందిని తెలిపారు. భారతదేశం సాధిస్తున్న డిజిటల్ చెల్లింపుల విప్లవాన్ని కొనియాడుతూ..గత సంవత్సరంలోనే భారతదేశం 2 కోట్ల యూపీఐ లావాదేవీలను నిర్వహించింది, ఇది ప్రపంచంలోని మొత్తం డిజిటల్ లావాదేవీలలో సగానికి పైగా ఉందన్నారు. 2025 నాటికి 44 కోట్ల కొత్త స్టార్టప్‌లు నమోదయ్యాయని, ఇది వ్యవస్థాపకత పట్ల భారతదేశ యువత ఆలోచనా విధానంలో వస్తున్న మార్పుకు సంకేతమని కూడా ఆయన పేర్కొన్నారు.

స్టార్టప్‌లు ఒక ఆలోచనా విధానంగా మారాయి అని మోదీ అన్నారు. యూనికార్న్ విలువలు 2014లో 4 నుండి నేడు 125కు పెరిగాయని ఆయన తెలిపారు. సెమీకండక్టర్ల తయారీ రంగంలో భారతదేశం వేగంగా పురోగమిస్తోంది. 12 ప్లాంట్ల పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు కేంద్రాలలో ఉత్పత్తి ప్రారంభమైందని మోదీ ప్రకటించారు. దిగుమతులపై ఆధారపడకుండా, చిప్‌లను దేశీయంగానే రూపకల్పన చేసి, తయారు చేయాలన్న భారతదేశ ఉద్దేశాన్ని ఇది స్పష్టం చేసింది.

కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), దాని అనుబంధ సాంకేతికతలలో భారతదేశం సాధించిన పురోగతిని కూడా మోదీ ప్రస్తావించారు. ప్రపంచ సాంకేతిక ఆవిష్కరణలలో దేశాన్ని ఒక వర్ధమాన కేంద్రంగా నిలబెడుతున్నట్లు పేర్కొన్నారు. ఐరోపాలోకి విస్తరించాలనుకునే భారతీయ వ్యాపారాలకు నెదర్లాండ్స్‌ను ఒక వ్యూహాత్మక ప్రవేశ మార్గంగా మోదీ అభివర్ణించారు. ఇరు దేశాల మధ్య విశ్వసనీయమైన వారధులను నిర్మిస్తున్న భారతీయ ప్రవాసులను ఆయన ప్రశంసించారు.

ఇవి కూడా చదవండి :

ప్రపంచ పటంలో ఉండాలో లేదో పాక్ తేల్చుకోవాలి : భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది
ఇంధన ధరల పెంపు.. మోదీ విశ్వాస ఘాతకం: సీఎం రేవంత్ రెడ్డి

Latest News