• Telugu News
  • /National

Nirmala Sitharaman : బెంగాల్ నుంచి బాగో బాగ్

14 ఏళ్లలో బెంగాల్ నుంచి 448 కంపెనీలు వెళ్లిపోయాయని, దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 27% నుంచి 3%కి పడిపోయిందని నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ఘాటు వ్యాఖ్యలు.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Dec 05, 2025, 1:19 pm IST
Read Time: 4 mins
Nirmala Sitharaman : బెంగాల్ నుంచి బాగో బాగ్

పశ్చిమ బెంగాల్ లో గుండాబాజీ సర్కార్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. పేద రోగులకు ఆక్సీజన్ మాదిరి ఉపయోగపడే ఆయుష్మాన్ భారత్ ను మమతా బెనర్జీ ప్రభుత్వం 2019లో విరమించుకున్నదని, ఇది రాష్ట్రానికి మంచిదేనా ఆమె ప్రశ్నించారు. 2011 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2025 సెప్టెంబర్ 30వ తేదీ వరకు 448 లిస్టెడ్ కంపెనీలు పశ్చిమ బెంగాల్ ను విడిచి వెళ్లిపోయాయని, 6,447 అన్ లిస్టెడ్ కంపెనీలు కూడా రాష్ట్రాన్ని వీడి పోయాయయని ఆమె లెక్కలతో సహా వివరించారు. 1947 సంవత్సరంలో దేశానికి స్వాతంత్ర్య వచ్చిందని, ఆ సమయంలో పశ్చిమ బెంగాల్ నుంచి దేశ జీడీపీ షేరులో 27 శాతం ఉండేదని నిర్మల వివరించారు. ప్రస్తుతం దేశ జీడీపీలో బెంగాల్ వాటా కేవలం 3 శాతం మాత్రమేనని, ఈ విషయం గుర్తు పెట్టుకోవాలని మంత్రి నిర్మల చురకలంటించారు.

రాజ్యసభలో గురువారం నాడు సెంట్రల్ ఎక్సైజ్ బిల్ – 2025 కు సవరణ పై జరగిన చర్చ సందర్భంగా టీఎంసీ సభ్యులు పశ్చిమ బెంగాల్ పై నిర్లక్ష్యం ఆపండి అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. చర్చపై మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ, ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వాలు పారదర్శకంగా ఉండడంతో పాటు బాధ్యతాయుతంగా ఉండాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రకారం వివరాలు పంపించడంతో బెంగాల్ ప్రభుత్వం విఫలమైందన్నారు. నాలుగు జిల్లాల్లో ఉపాధి హామీ పథకంలో తప్పులు చేసిన వారి నుంచి రూ.4.81 కోట్లు రికవరీ చేసినట్లు కేంద్రానికి సమాచారం పంపించిందని, అయినప్పటికీ 2022 నుంచి కేంద్రం కోరిన విధంగా సమాచారం పంపించడం లేదన్నారు. తప్పు చేసిన ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారన్నారు. 2006-07 ఆర్థిక సంవత్సరం నుంచి 2013-14 వరకు పశ్చిమ బెంగాల్ కు ఉపాధి హామీ పథకం కింద రూ.14,985 కోట్లు విడుదల కాగా, 2014-15 నుంచి 2021-22 వరకు నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ.54,416 కోట్లు (261 శాతం పెరుగుదల) విడుదల చేసిందని మంత్రి నిర్మలా సీతారామన్ వివరాలు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి :

Rangareddy : ల్యాండ్ రికార్డు ఏడీ అక్రమాస్తులు రూ.100కోట్లపైనే!
Akhanda 2 | ‘అఖండ 2’ రిలీజ్ విష‌యంలో ఇంత ర‌చ్చ నడుస్తున్నాబాల‌య్య మౌనం… కార‌ణం ఏంటి?