Petrol | వాహనదారులకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇంధన ధరలు పెరగడం వారంలో ఇది రెండోసారి. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు 90 పైసల చొప్పున కేంద్రం పెంచింది. పెరిగిన పెట్రోల్ ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. పెరిగిన పెట్రోల్ ధరలపై వాహనదారులు భగ్గుమంటున్నారు. కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నారు.
ఇటీవల లీటర్ పెట్రోల్, డీజిల్పై రూ. 3 పెంచిన సంగతి తెలిసిందే. ఆ పెరుగుదల పరిణామం మరువకముందే మరోసారి ధరలు పెంచడం వాహనదారులకు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది.
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్తో.. భారత ప్రభుత్వానికి చెందిన ఆయిల్ కంపెనీలు అధిక ధరలకు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటిదాకా ఆ భారాన్ని వినియోగదారులపై వేయకుండా రోజుకు సుమారు రూ.1,600 కోట్ల నష్టాన్ని భరించాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంచేందుకు కేంద్రం కూడా ఇంధన ధరలు పెంచకుండా ఆగింది.
కానీ.. దీర్ఘకాలంగా కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ యుద్ధం, హర్ముజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా నౌకా రవాణా ఆగిపోవడంతో చమురు, వాయువు సరఫరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంధన ధరల పెరుగుదల తప్పనిసరి అయింది. అయితే మరోసారి యుద్ధ వాతావరణం నెలకొనడం.. హర్ముజ్ ఉద్రిక్తతలు చల్లారకపోవడంతో ఈ పెంపు ఇక్కడితో ఆగకపోవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
