పరీక్షల పేపర్ల లీకేజీల కట్టడి..పరీక్షల సక్రమ నిర్వహణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సోమవారం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు-2026 ను లోక్ సభలో ప్రవేశ పెట్టింది. విపక్షాల ఆందోళన మధ్య కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై సవరణలకు మధ్యాహ్నం 1గంట వరకు సమయం ఇచ్చిన స్పీకర్ సభను 2గంటలకు వాయిదా వేశారు. బిల్లుపై చర్చలో అన్ని పార్టీలు పాల్గొనాలని కోరారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు-2026 లో పేపర్ లీకేజీపై విచారణను రెండు నెలల్లో పూర్తి చేయడం..అందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, దోషులకు రూ.10కోట్ల జరిమానా, 10ఏళ్ల వరకు జైలు శిక్ష వంటి సవరణలు ప్రతిపాదించారు.
అంతకుముందు సోమవారం ఉదయం పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు విద్యార్ధులపై ఇటీవల జంతర్ మంతర్ వద్ద లాఠీచార్జ్ చేసిన ఢిల్లీ పోలీసులపై కేంద్రం చర్యలు తీసుకోవాలని, ప్రధాని మోదీ విద్యార్ధులకు క్షమాపన చెప్పాలని, విద్యా వ్యవస్థలోని లోపాలపై చర్చించాలని పట్టుబడుతూ సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో ఉభయ సభలలోనూ అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య పోటాపోటీ నినాదాలు చోటుచేసుకోవడంతో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ ఓం బిర్లా లోక్ సభను, చైర్మన్ రాజ్యసభను మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేశారు. లోక్ సభ తిరిగి ప్రారంభం కాగానే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు-2026 ను కేంద్రం సభలో ప్రవేశ పెట్టింది.