Site icon vidhaatha

Ratna Bhandar | తెరుచుకున్న పూరీ జగన్నాధుడి రత్న భాండాగారం

46ఏళ్ల తర్వాతా తెరుచుకున్న రహస్య గదులు

విధాత, హైదరాబాద్ : పూరీ జగన్నాధుడి రహస్య గదుల్లోని రత్న భాండాగారం గదులను అధికారుల కమిటీ ఆదివారం తెరిచింది. జగన్నాధుడి సేవలకు ఆటంకం లేకుండా రత్న భాండాగారం గదులను అధికారుల బృందం తెరిచింది. 46ఏళ్ల తర్వాతా రత్న భాండాగారం గదులను తెరిచారు. 1978లో చివరిసారిగా ఆ గదులను తెరిచారు. రత్నభాండాగారం రహస్య గది తెరిచినట్లుగా ఒడిశా సీఎంవో వెల్లడించింది. గదిలోని సంపదను మార్చేందుకు ఆలయానికి పెద్ద ఎత్తున ప్రత్యేక ట్రంకు పెట్టెలను ఆరింటిని తెప్పించారు. పాత చెక్కపెట్టెల్లోని ఆభరణాలు, ఆస్తులను కొత్త పెట్టెల్లోకి మార్చనున్నారు. జగన్నాథుడి రత్న భాండాగారాన్ని తెరువాలని జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మందితో ఒడిశా సర్కారు ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం తీసుకుంది. శ్రీక్షేత్రంలో జగన్నాథుడికి నిత్యం 119 మూలికా సేవలు జరుగుతాయి. వీటిని నిర్ణీత వేళల్లో సేవాయత్‌లు చేపడతారు.

రత్న భాండాగారాన్ని తెరిచే క్రమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సేవలకు అంతరాయం కలగకూడదని నిర్ణయించారు. తెరిచిన రత్న భాండాగారంలోని ఆస్తుల వివరాలను ఈ దఫా డిజిటలైజేషన్ చేయనున్నారు. లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుంది? అనే విషయాలు తెలియాల్సి ఉంది. రత్నభాండాగారంలో నాలుగు గదుల్లో మూడింటిని ప్రస్తుతానికి తెరిచారు. నాల్గవ గది కూడా తెరిచే ప్రయత్నం చేస్తున్నారు. భాండాగారం మరమ్మతులు, లెక్కింపు ఒకేసారి జరగనుందా? తదితర వివరాలపై స్పష్టత రాలేదు. లోపల విషసర్పాలు ఉంటాయన్న అనుమానాల నేపథ్యంలో పూరీ రత్న భాండాగారంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మరోవైపు స్నేక్ హెల్ప్ లైన్ నిపుణులు, అత్యవసర వైద్యానికి డాక్టర్లు లోపలికి వెళ్లినట్లు సమాచారం.

1978లో 70రోజుల లెక్కింపు

పూరీ జగన్నాథుని ఆభరణాలను ఐదు కర్ర పెట్టెల్లో ఉంచి, రహస్య గదిలో భద్రపరిచారు. పూర్వం మూడేళ్లు లేదా ఐదేళ్లకోసారి ఈ గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు. చివరిసారిగా 1978లో లెక్కించగా.. 70 రోజులు పట్టింది. అప్పట్లో కొన్నింటిని వదిలేయడంతో లెక్కలపై సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్ధించింది. రహస్య గదులు జీర్ణావస్థకు చేరి, వర్షపు నీరు లీకై గోడలు బీటలు వారుతున్నందున మరమ్మతులు చేయాలని కోర్టులు 2018లోనే పురావస్తు శాఖను ఆదేశించాయి. 2019 ఏప్రిల్ 6న నాటి నవీన్ పట్నాయక్ సర్కారు నియమించిన 13 మందితో కూడిన అధ్యయన సంఘం తలుపులు తెరవడానికి వెళ్లగా, రహస్య గది తాళపుచెవి కనిపించలేదు. దీంతో సభ్యులు వెనుదిరిగారు. తర్వాత మరమ్మతులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధ్యయనానికి ప్రభుత్వం జస్టిస్ రఘువీరాస్ కమిటీని నియమించింది.

ఇంతలో డూప్లికేట్ తాళపుచెవి పూరీ కలెక్టరేట్ ట్రెజరీలో ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు రఘువీర్ కమిటీ నివేదికను ప్రభుత్వం వెల్లడించలేదు. దీన్ని ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ ప్రచారాస్త్రంగా చేసుకుంది. తాము అధికారంలోకి వస్తే భాండాగారం తెరిపిస్తామన్న హామీకి కట్టుబడి, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రణ్ అధ్యక్షతన 16 మందితో కమిటీ వేసింది. ఆ కమిటీ రత్న భాండాగారం తెరవాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. భాండాగారం లోపల ఎలా ఉందో ఎవరికీ అవగాహన లేదు. 46 ఏళ్లుగా అందులోకి ఎవరూ వెళ్లలేదు. ఆర్‌బీఐ ప్రతినిధులు, బంగారం నిపుణులు సైతం అధికారుల బృందంలో ఉన్నారు. ప్రస్తుతం పూరీలో రథయాత్ర జరుగుతోంది. ఈ నె 19 వరకు వరకు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలు ఆలయం వెలుపల ఉంటారు. ఈ నేపథ్యంలో అధికారులు చేపట్టనున్న లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుందని వేచిచూడాల్సివుంది.

Exit mobile version