అమెరికాకు చెందిన ఓ మహిళా.. జైపూర్ వాసి చేతిలో మోసపోయింది. అతని మాటలకు మోపోయిన ఆ మహిళ.. రూ. 300 విలువ చేసే ఆభరణాలను రూ. 6 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.
జైపూర్ : అమెరికాకు చెందిన ఓ మహిళా.. జైపూర్ వాసి చేతిలో మోసపోయింది. అతని మాటలకు మోపోయిన ఆ మహిళ.. రూ. 300 విలువ చేసే ఆభరణాలను రూ. 6 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. అమెరికాలో నిర్వహించిన ఎగ్జిబిషన్లో ఆ ఆభరణాలను ప్రదర్శించగా, అవి నకిలీవని తేలింది. దీంతో ఈ విషయం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన చెర్రీష్ అనే మహిళకు 2022లో ఇన్స్టాగ్రామ్లో రాజస్థాన్ రాజధాని జైపూర్కు చెందిన గౌరవ్ సోని పరిచయమయ్యాడు. జోహ్రీ బజార్లో గౌరవ్ బంగారం దుకాణం నిర్వహిస్తున్నాడు. రూ. 300 విలువ చేసే వెండి ఆభరణాలకు గోల్డ్ పాలిష్ వేశాడు. అవి బంగారు ఆభరణాలు అని చెప్పి ఆమెను సోని మోసం చేశాడు. ఆ ఆభరణాల ఖరీదు రూ. 6 కోట్లు అని చెప్పడంతో.. ఆమె అంత డబ్బు సోనికి అప్పజెప్పింది. ఇక ఆభరణాలను తీసుకెళ్లింది.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అమెరికాలో నిర్వహించిన ఎగ్జిబిషన్లో ఆ ఆభరణాలను చెర్రీష్ ఉంచింది. అవి నకిలీవని తేలింది. దీంతో చెర్రీష్ జైపూర్కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు సహాయం చేయాలని ఇండియాలోని యూఎస్ ఎంబసీని కూడా కోరింది ఆమె. అయితే గౌరవ్ సోనితో పాటు అతని తండ్రి పరారీలో ఉన్నారు. తండ్రీకుమారులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు చర్యలు తీసుకుంటున్నాయని పోలీసులు చెప్పారు.