Divorce | పెళ్లై 58 ఏళ్లు.. విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన వృద్ధ జంట‌

పెళ్లై (Marriage) 58 ఏళ్లు. పిల్ల‌లు కూడా ఉన్నారు. ఒక‌రికొక‌రు తోడు, నీడ‌గా ఉండాల్సిన స‌మ‌యంలో ఓ వృద్ధ జంట (Elderly couples) విడాకుల (Divorce) కోసం కోర్టుమెట్లెక్కింది. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌ (Rajasthan)లో వెలుగు చూసింది. అయితే, కోర్టు వారికి విడాకులు ఇచ్చేందుకు నిరాక‌రించింది.

Divorce | పెళ్లై 58 ఏళ్లు.. విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన వృద్ధ జంట‌

Divorce | పెళ్లంటే (Marriage) నూరేళ్ల పంట అని పెద్దలు చెబుతుంటారు. కానీ నేటి సమాజంలో పెళ్లంటే మూన్నాళ్ల ముచ్చటగా మారిపోయింది. జీవితాంతం కలిసి ఉండాలనే ఓపిక చాలామంది భార్యాభర్తల్లో సన్నగిల్లుతోంది. అభిరుచులు కలవడం లేదని.. అభిప్రాయాలు కుదరడం లేదని చిన్న చిన్న కారణాలకే యువ‌త‌ మనస్పర్థలు పెంచుకుంటున్నారు. గొడవలు పడుతున్నారు. గిల్లికజ్జాలు ముదిరి మాటామాటా పెరగడంతో విడాకుల (Divorce) వరకూ వెళ్లిపోతున్నారు.

ప్రేమ, పెళ్లి.. వెంట‌నే విడాకులు. ప్ర‌స్తుతం స‌మాజంలో ఇదే జ‌రుగుతోంది. చాలా మంది యువ‌త పెళ్లైన నెల‌లు, ఏడాదికే విడిపోవాల‌ని నిర్ణ‌యించుకుంటున్నారు. ఒక‌ప్పుడు విదేశాల్లో ఎక్కువ‌గా క‌నిపించే ఈ విడాకుల సంస్కృతి ఇప్పుడు మ‌న ద‌గ్గ‌ర కూడా బాగా పెరిగిపోయింది. సినీ సెల‌బ్రిటీలు మొద‌లు, రాజ‌కీయ‌, వ్యాపార వేత్త‌లు, సామాన్యులు సైతం చిన్న చిన్న కార‌ణాల‌కే విడిపోవాల‌నే పెద్ద నిర్ణ‌యం తీసుకుంటున్నారు. అయితే, దాదాపు 30 ఏళ్లు క‌లిసి ఉన్న జంట‌లు విడాకులు తీసుకునే అవ‌కాశం చాలా త‌క్కువ. కానీ 56 ఏళ్ల వ‌య‌సులో ఓ వృద్ధ జంట విడాకుల కోసం కోర్టుకెక్కడం హాట్‌టాపిక్ అవుతోంది.

రాజస్థాన్‌కు చెందిన ఓ జంట‌కు 1967, జూన్‌లో వివాహ‌మైంది. దాదాపు 40 ఏళ్ల‌కు పైగా ఈ జంట ఎంతో అన్యోన్యంగా జీవితం సాగించింది. చిన్న‌చిన్న త‌గాదాలు ఉన్న‌ప్ప‌టికీ వాటిని అధిగ‌మించి ముందుకు సాగింది. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. పెళ్లిళ్లు చేశారు కూడా. అయితే, ప‌దేళ్ల కింద‌ట వీరి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చాయి. పిల్ల‌ల‌కు ఆస్తిపంచే విష‌యంలో బేధాభిప్రాయాలు వ‌చ్చాయి. త‌మ పేరు మీద ఉన్న ఆస్తిని పెద్ద కొడుక్కు ఇవ్వాల‌ని భార్య ప‌ట్టుబ‌ట్ట‌గా.. ఇద్ద‌రు కొడుకుల‌కూ స‌మానంగా పంచాల‌ని భ‌ర్త స్ప‌ష్టం చేశాడు. ఈ అంశంపై ఇద్ద‌రి మ‌ధ్యా బేధాభ్రిప్రాయాలు వ‌చ్చాయి. అవి తారాస్థాయికి చేర‌డంతో ఇద్ద‌రూ విడాకులు తీసుకునేందుకు కోర్టుమెట్లెక్కారు.

వివాహమైన 47 ఏళ్లకు.. మే 26, 2014లో వీరు విడాకులకు ద‌రఖాస్తు చేసుకున్నారు (ప్ర‌స్తుతం వారికి వివాహ‌మై 58 ఏళ్లు).. తొలుత భర్త దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను భరత్‌పూర్ ఫ్యామిలీ కోర్టు కొట్టివేసింది. దీన్ని సవాలు చేస్తూ ఆయన తిరిగి రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సంద‌ర్భంగా భార్యా, భ‌ర్త‌లు ఒక‌రిపై ఒక‌రు తీవ్ర ఆరోప‌ణ‌లు చేసుకున్నారు. త‌మ ఆస్తిని భ‌ర్త విడ‌దీయాల‌నుకుంటున్నార‌ని భార్య ఆరోపించింది. అంతేకాదు భ‌ర్త‌కు వేరే మ‌హిళ‌తో వివాహేతర సంబంధం ఉంద‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. ఇక భర్త‌సైతం భార్య‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. త‌న‌ను నిర్ల‌క్ష్యం చేస్తోంద‌ని ఆరోపించారు. ఈ మేర‌కు త‌మ‌కు విడాకులు కావాల‌ని న్యాయ‌మూర్తిని అభ్య‌ర్థించారు.

వీరి విడాకుల కేసు విచార‌ణ‌ దాదాపు ప‌దేళ్లుగా సాగుతోంది. ఈ క్ర‌మంలో తాజాగా వృద్ధ జంట దాఖ‌లు చేసిన విడాకుల పిటిష‌న్‌పై కోర్టు విచార‌ణ జ‌రిపింది. ఈ సంద‌ర్భంగా కీల‌క తీర్పు వెలువ‌రించింది. ఈ జంట‌కు విడాకులు ఇవ్వ‌లేమ‌ని తేల్చి చెప్పింది. కుటుంబ కలహాల కారణంగా ఒక జంటకు విడాకులు ఇవ్వలేమని, ఈ కారణాలు సరిపోవని వ్యాఖ్యానించింది. ఈ మేర‌కు జ‌స్టిస్ సుదేశ్ బ‌న్స‌ల్‌, జ‌స్టిస్ అనిల్ కుమార్ ఉప్మ‌న్‌తో కూడిన బెంచ్ తీర్పు చెప్పింది.

ఇవి కూడా చదవండి :

Digital Holy Water : టెక్నాలాజీ మాయ.. గుడులలో డిజిటల్ తీర్థం మిషన్లు !
Jewellery Stolen | పెళ్లి వేదికపైనే.. రూ. 4 లక్షలున్న బ్యాగ్‌ను కొట్టేసిన దొంగ.. షాకింగ్ వీడియో