Indresh Kumar | రాముడు శిక్షించాడు.. అందుకే ఆ పార్టీకి 240 సీట్లు

ఎన్నికల్లో బీజేపీ పరాజయంపై ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ విమర్శలు చేసిన మూడు రోజుల వ్యవధిలోనే మరో ఆరెస్సెస్‌ నేత సైతం విమర్శలు చేశారు

  • Publish Date - June 14, 2024 / 05:10 PM IST

ఒకప్పుడు రామభక్త పార్టీ.. ఇప్పుడు అహంభావిగా మారింది
ఆరెస్సెస్‌ సీనియర్‌ నేత ఇంద్రేశ్‌కుమార్‌ పరోక్ష వ్యాఖ్యలు

జైపూర్‌: ఎన్నికల్లో బీజేపీ పరాజయంపై ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ విమర్శలు చేసిన మూడు రోజుల వ్యవధిలోనే మరో ఆరెస్సెస్‌ నేత సైతం విమర్శలు చేశారు. గురువారం (జూన్‌ 13) జైపూర్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన సీనియర్‌ ఆరెస్సెస్‌ నేత ఇంద్రేశ్‌ కుమార్‌.. రాముడి భక్తులమని చెప్పుకొనే రాజకీయ పార్టీకి అహంభావం పెరిగిపోయిందని, అందుకే 240 సీట్లకు పరిమితమైందని వ్యాఖ్యానించారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లకు పరిమితమై.. సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని దుస్థితికి చేరుకున్న విషయం తెలిసిందే.

2019లో బీజేపీకి 303 సీట్లు రాగా.. ఈసారి అందులో 63 సీట్లు తగ్గిపోయాయి. ‘ప్రజాస్వామ్యం పండుగలో 2024లో కూడా మీరు రాముడు చేసిన న్యాయాన్ని చూడొచ్చు. ఎవరైతే రాముడిని పూజిస్తూ వచ్చారో.. వారు మెల్లమెల్లగా అహంకారులుగా మారిపోయారు. పెద్ద పార్టీగా భారీ ఓట్లు ఉన్నాయని ప్రకటించుకున్నారు. ఆ ఓట్లతో అధికారంలోకి రావాల్సి ఉన్నది. కానీ.. వారి అహంకారం కారణంగా వారిని దేవుడు ఆపివేశాడు’ అని జైపూర్‌ సమీపంలోని కనోటా వద్ద రామరథ్‌ అయోధ్య యాత్రాదర్శన్‌ పూజా సమారోహ్‌లో మాట్లాడుతూ అన్నారు.

రాముడిని వ్యతిరేకించేవారు ఎవరూ, ఐక్యంగా కూడా అధికారాన్ని సాధించలేకపోయారని అన్నారు. ఒకటో స్థానానికి బదులు రెండో స్థానంలో నిలిచారని, దేవుడి న్యాయం వింత కాదని, వాస్తవమని చెప్పారు. కొద్ది రోజుల క్రితం ఎన్నికల ఫలితాలపై మాట్లాడిన ఆరెస్సెస్‌ సర్‌సంఘ్‌ చాలక్‌ మోహన్‌ భాగవత్‌.. ‘నిజమైన సేవకులకు అహంకారం ఉండదు’ అని చెప్పారు. భాగవత్‌ తరహాలోనే కుమార్‌ కూడా.. అహంకారం అనే పదాన్ని నొక్కి చెప్పడం గమనార్హం. అదే సమయంలో రాముడి వ్యతిరేకలంటూ ఇండియా కూటమి పేరు ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. ‘భక్తి ఉన్న పార్టీ అహంకారిగా మారింది. 240 స్థానాలకు పరిమితమైంది. కానీ.. ఏకైక పెద్ద పార్టీగా ఉన్నది.

రాముడిని వ్యతిరేకించే వారందరూ 236కు పరిమితమయ్యారు’ అని చెబుతూ.. విశ్వాసం లేనివారికి ఇది దండనగా అభివర్ణించారు. కొంతకాలంగా బీజేపీకి, దాని మాతృసంస్థ ఆరెస్సెస్‌కు మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా.. గతంలో బీజేపీకి ఆరెస్సెస్‌ అవసరమయ్యేదని, ఇప్పుడు పార్టీ సొంతగా నడుస్తున్నదని చెప్పారు. ఆరెస్సెస్‌ ఒక సాంస్కృతిక వేదిగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై సంఘ్‌ నాయకత్వం గుర్రుగా ఉన్నదనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ సొంతగా మెజార్టీ సాధించలేక పోయిన నేపథ్యంలో బహిర్గతమవుతున్నాయి.

Latest News