Site icon vidhaatha

Vinesh Phogat । ఫొగట్‌ విజయంపై అక్కసు వెళ్లబోసుకున్న బ్రిజ్‌భూషణ్‌

Vinesh Phogat । హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మాజీ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌పై బీజేపీ మాజీ ఎంపీ, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌ అక్కసు వెళ్లగక్కారు. ఆమె గెలిచినా ఆమె పార్టీ ఓడిపోయిందని అన్నారు. వినేశ్‌ ఎక్కడికి వెళ్లిన అంతా నాశనమేనని బ్రిజ్‌భూషణ్‌ విమర్శించారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ బ్రిజేశ్‌ పై వినేశ్‌ ఫొగట్‌ పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రెజ్లర్ల ఆందోళన హర్యానా ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ఏ మాత్రం ప్రభావితం చేయలేక పోయిందని బ్రిజ్‌ భూషణ్‌ వ్యాఖ్యానించారు. జాట్‌లు అధికంగా ఉండే స్థానాల్లో సైతం బీజేపీ గెలిచిందని చెప్పారు.

‘జాట్‌ మెజార్టీ సీట్లలో అనేక మంది బీజేపీ అభ్యర్థులు గెలిచారు. రెజ్లర్ల ఆందోళనలో రెజ్లర్లు హీరోలేం కాదు. జూనియర్‌ రెజ్లర్ల పాలిట విలన్లు కూడా.  ఆమె నా పేరు చెప్పుకొని గెలిచిందంటే అది నా గొప్పతనం. ఆమె గెలిచినా.. కాంగ్రెస్‌ ఓడిపోయింది. ‘ఓ జహా జహా జాయేగీ సత్యనాశ్‌ హీ హోగా’ (ఆమె ఎక్కడికి వెళ్లినా నాశనమే) అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. జులానా నియోజకవర్గం నుంచి గెలిచిన వినేశ్‌ ఫొగట్‌.. తన విజయం ప్రతి ఆడబిడ్డ, మహిళ పోరాటమని  అన్నారు. ‘ఈ పోరాటం ప్రతి ఒక్క ఆడబిడ్డది. ప్రతి మహిళది. వారంతా పోరాట పంథా ఎంచుకున్నారు. అన్ని పోరాటాలకు లభించిన విజయమిది. వాస్తవం. ఈ దేశం నాకు ఇచ్చిన విశ్వాసం, ప్రేమను నేను కొనసాగిస్తాను’ అని ఫొగట్‌ చెప్పారు.

Exit mobile version