రాజ్యసభలో బీజేపీకి మ్యాజిక్ ఫిగర్?

వచ్చే నెల జరగనున్న 24 రాజ్యసభ స్థానాల ఎన్నికలతో బీజేపీ, మిత్రపక్షాల బలం పెరగనుంది. దీంతో యూసీసీ, వక్ఫ్ సవరణ బిల్లుల ఆమోదానికి మార్గం సుగమమవుతుందని విశ్లేషణలు చెబుతున్నాయి.

 

విధాత, హైదరాబాద్: దిగువ సభలో బలం ఉన్నప్పటికీ ఎగువ (పెద్దల) సభ లో సరిపడా సభ్యుల సంఖ్య లేకపోవడంతో కేంద్రంలోని బీజేపీ పెద్దలకు తలనొప్పిగా మారింది. మెజారిటీ లేకపోవడంతో పలు బిల్లులు వీగిపోతున్నాయి. మొన్నటికి మొన్న నియోజకవర్గాల పెంపు బిల్లు లోకసభలో ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభలో వీగిపోయింది. రాజ్యసభలో మ్యాజిక్ ఫిగర్ లేకపోవడం మూలంగా పలు బిల్లులు పాస్ కావడం లేదు. అయితే వచ్చే నెలలో 10 రాష్ట్రాలలో 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్ర పక్షాలకు అదనంగా 20 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో రాజ్యసభలో బలం పెరిగడం మూలంగా ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులకు అడ్డంకులు లేకుండా పోతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దేశంలోని పది రాష్ట్రాలలో జూన్, జూలై నెలలో 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనున్నది. కేంద్ర ఎన్నికల కమిషన్ మంగళవారం తెలంగాణ, ఏపీతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ వెలువరించింది. ఈ మేరకు జూన్ 1వ తేదీన నోటిఫికేషన్ వెలువడుతుందని, మొత్తం 24 స్థానాలకు జూన్ 18వ తేదీన ఎన్నికలు జరపనున్నట్లు ప్రకటించింది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు జూన్ 11గా పేర్కొన్నారు. ఫలితాలు అదే రోజు సాయంత్రం ప్రకటించనున్నారు.

మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్, తమిళనాడు లో సీవీ షన్ముగం లు తమ రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ రెండింటికి కూడా ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. మాజీ ప్రధాన మంత్రి హెచ్.డీ.దేవేగౌడ, కేంద్ర మంత్రి జార్జి కురియన్, రవనీత్ సింగ్ ల పదవీకాలం ముగియనున్నది. వీరితో పాటు ఏపి, గుజరాత్, కర్నాటక రాష్ట్రాల నుంచి నలుగురు చొప్పున, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి ముగ్గురు, జార్ఖండ్ నుంచి ఇద్దరు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం నుంచి ఒకరు చొప్పున ఎన్నిక కానున్నారు. మొత్తం 24 సీట్లకు జరిగే ఎన్నికలతో రాజ్యసభలో బీజేపీకి బలం పెరగనున్నది. అయితే ఈ ఎన్నికలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కీలకం కానున్నాయి. ప్రస్తుతం రాజ్యసభలో మ్యాజిక్ ఫిగర్ 119 కాగా, బీజేపీ, దాని మిత్రపక్షాల బలం 95 మాత్రమే ఉంది. దీంతో పలు బిల్లులు ఆమోదానికి నోచుకోకుండా వీగిపోతున్నాయి.

ప్రస్తుతం రాజ్యసభలో 95 మంది ఉండగా, రానున్న ఎన్నికల్లో అదనంగా 18 నుంచి 20 సీట్లు పెరగనున్నాయి. దీంతో బీజేపీ, దాని మిత్రపక్షాల సంఖ్య 115కు చేరుకోనున్నది. మ్యాజిక్ ఫిగర్ చేరుకోనుండడంతో లోకసభలో ఆమోదించిన బిల్లులు రాజ్యసభలో పాస్ కావడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. వక్ఫ్ సవరణ బిల్లు-2025, ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ), ఉగ్రవాద నిరోధక బిల్లు (పోటా), బ్యాంకింగ్ సర్వీసు కమిషన్, పంచాయతీ, మున్సిపాలిటీ, ప్రివ్రీ పర్సుల రద్దు వంటి కీలక బిల్లులు ఆటంకాలు లేకుండా ఆమోదం పొందనున్నాయి. గతంలో ఈ బిల్లులును లోకసభలో ఆమోదించగా, రాజ్యసభలో సరిపడా బలం లేకపోవడంతో తిరస్కరించబడిన విషయం తెలిసిందే.

బీజేపీ, మిత్రపక్ష పాలిత రాష్ట్రాలు అయిన ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఏపీ నుంచి మెజారిటీ సభ్యులు ఎన్నుకోనున్నారు. ఏపీ లో గతంలో వైసీపీ నుంచి ఎన్నికైన ఆళ్ళ అయోధ్యరామి రెడ్డి, పరిమళ్ నాత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్ తో పాటు టీడీపీ సభ్యులు సానా సతీష్ బాబు పదవీకాలం ముగియనున్నది. ఏపీలో కూటమి ప్రభుత్వానికి 164 మంది ఎమ్మెల్యేల బలం ఉండడంతో నాలుగు స్థానాలను సునాయసంగా కైవసం చేసుకోనున్నది.

ఇవి కూడా చదవండి :

ధాన్యం కొనుగోలు సమస్యలపై కవిత సచివాలయం ముట్టడి
దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్ : సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

Latest News