Flight Journey | కేవలం రూ.349 ఖర్చుతో విమాన ప్రయాణం.. ఎక్కడో తెలుసా..?

Flight Journey | విమానంలో ప్రయాణం అంటే వేలల్లో మాటే. వేలకు వేలు ఖర్చును భరించగలిగితే తప్ప విమానం ఎక్కలేం. అందుకే ఇంతో అంతో ఆర్థిక స్థోమత ఉన్నవాళ్లు మాత్రమే విమానాల్లో తిరగగలుగుతున్నారు. కానీ ఇప్పుడు కేవలం రూ.349 ఛార్జితో విమానంలో ప్రయాణించే ఛాన్స్ వచ్చింది. అయితే అది మన రాష్ట్రంలో కాదు. ఎక్కడో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Publish Date - April 16, 2024 / 09:37 AM IST

Flight Journey : విమానంలో ప్రయాణం అంటే వేలల్లో మాటే. వేలకు వేలు ఖర్చును భరించగలిగితే తప్ప విమానం ఎక్కలేం. అందుకే ఇంతో అంతో ఆర్థిక స్థోమత ఉన్నవాళ్లు మాత్రమే విమానాల్లో తిరగగలుగుతున్నారు. కానీ ఇప్పుడు కేవలం రూ.349 ఛార్జితో విమానంలో ప్రయాణించే ఛాన్స్ వచ్చింది. అయితే అది మన రాష్ట్రంలో కాదు. ఎక్కడో ఇప్పుడు తెలుసుకుందాం..

అసోం రాష్ట్రంలోని లిలాబరి నుంచి తేజ్‌పూర్‌ మధ్య 50 నిమిషాల విమాన ప్రయాణానికి కేవలం రూ.349 మాత్రమే చార్జి తీసుకుంటున్నారు. అందులో రూ.150 బేస్‌ ఛార్జి కాగా.. కన్వినీయన్స్‌ ఛార్జి కింద రూ.199 వసూలు చేస్తున్నారు. ఈ రూ.349కి మించి ఇంకా ఎలాంటి అదనపు భారాలు లేవు. అయితే ఇవి రోజువారీ సర్వీసులు కావు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ సర్వీసులు నడుస్తాయి.

అంతేకాదు.. రూ.1000 కంటే తక్కువ బేస్‌ టికెట్‌ ధరతో దేశంలో పలు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఈ విమానాలన్నీ ప్రాంతీయ విమాన అనుసంధానత పథకం (ఉడాన్‌) కింద కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ పథకం కింద విమానయాన సంస్థలకు పలు ప్రోత్సాహకాలు లభిస్తుండటమే ఈ చౌక ధరలకు కారణమని ట్రావెల్‌ పోర్టల్‌ ఐక్సిగో తెలిపింది.

ఒక వ్యక్తికి రూ.1000 కంటే తక్కువ బేస్‌ ఛార్జీతో ప్రయాణ సదుపాయం కల్పించేందుకు దేశంలో 22 విమాన మార్గాలున్నాయని, లిలాబరి – తేజ్‌పూర్‌ మధ్య అత్యల్పంగా రూ.150 బేస్‌ ఛార్జితో అలయన్స్‌ ఎయిర్‌ విమానాలు నడుపుతోందని ఇక్సిగో వెల్లడించింది. టికెట్‌ బుకింగ్‌ సమయంలో బేస్‌ ఛార్జికి అదనంగా కన్వీనియెన్స్‌ ఛార్జి వసూలు చేస్తారు.

ప్రాంతీయ అనుసంధానత పథకంలో నడిచే విమానాల సమయం దాదాపు 50 నిమిషాలు ఉంటుంది. రూ.150 – 199 బేస్‌ ఛార్జీ మార్గాలు ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నాయి. దక్షిణాదిలో ఈ శ్రేణిలో ధరలు బెంగళూరు-సేలం, కొచ్చి-సేలం (రూ.525 బేస్‌ ఛార్జి) మార్గాల్లో ఉన్నాయి. గువాహటి – షిల్లాంగ్‌ మధ్య బేస్‌ టికెట్‌ ధర రూ.400గా ఉంది.

Latest News