UK Visa | యూకే వీసా నిబంధనలు కఠినతరం: 67శాతం పడిపోయిన నియామకాలు

యూకే ప్రభుత్వం కఠిన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు అమలు చేయడంతో భారతీయ హెల్త్‌కేర్, ఐటీ ప్రొఫెషనల్స్ నియామకాలు 67 శాతం తగ్గాయి. డిపెండెంట్ వీసాలు, జీతాల పరిమితులపై నిబంధనలు విధించారు.

Indian passport with UK visa pages highlighting tougher UK visa rules for Indians

UK Visa Rules Tightened: 67% Drop in Jobs for Indian Health & IT Professionals

(విధాత నేషనల్​ డెస్క్​)

యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) వీసాల జారీలో కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలు భారతదేశ హెల్త్ కేర్, ఐటీ ప్రొఫెషనల్స్ కు శాపంగా పరిణమించాయి. ఇమ్మిగ్రేషన్ నిబంధనల మార్పు కారణంగా ప్రతి వంద మందిలో 67 శాతం మంది యూకే వీసాలను పొందలేకపోయారు. హెల్త్ అండ్ కేర్ వర్కర్ కోటా కింద 16,606 మంది వీసా దరఖాస్తులు సమర్పించగా 2,225 మందికి మాత్రమే జారీ చేశారు. ఐటీ ప్రొఫెషనల్స్ కు 10,051 మందికి అనగా 20 శాతం మందినే అనుమతించారు.

విదేశాల నుంచి ఉద్యోగాలు, ఉపాధి కోసం వచ్చేవారిని నిలువరించేందుకు యూకే ప్రభుత్వం జూలై 22, 2025లో ఇమ్మిగ్రేషన్ విధానంలో భారీ సంస్కరణలు తీసుకువచ్చి కఠిన నిబంధనలు పొందుపర్చింది. నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు ఇప్పుడున్న జీతాలను మూడింతలు పెంపుదల చేసింది. ఇదే కాకుండా డిపెండెంట్ వీసా కింద వచ్చే వారిని నిరోధించేందుకు అర్హతలను మరింత కఠినతరం చేసింది. దీంతో వీసా పొందిన కుటుంబంలో భార్య లేదా భర్త ను మాత్రమే ఆ దేశంలోకి అనుమతిస్తారు. ఇద్దరిని ఎట్టి పరిస్థితుల్లో రానివ్వరు. నిబంధనల మార్పు కారణంగా ఎక్కువ నైపుణ్యం కలిగిన వారు దేశంలోకి రావడమే కాకుండా అర్హత ఉన్నవారు మాత్రమే ప్రవేశం పొందుతారని యూకే ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మార్పునకు ముందు బ్రిటన్ హెల్త్ కేర్ అండ్ ఐటీ రంగంలో భారతీయులకు ఎక్కువగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించాయి.

విద్యార్థుల విషయంలో కూడా కఠినంగానే

ఉన్నత విద్య కోసం వచ్చే విదేశీ విద్యార్థుల విషయంలో కూడా కఠినంగా వ్యవహరిస్తున్నది. గ్యాడ్యుయేషన్ కోర్సులలో చేరేవారి వీసా సమయాన్ని రెండు సంవత్సరాల 18 నెలలకు కుదించింది. ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడే వారికి గ్రాడ్యుయేషన్ లో అడ్మిషన్లు ఇవ్వాలని యూనివర్సిటీలకు స్పష్టం చేసింది. గ్యాడ్యుయేషన్ చదువు పూర్తయిన వారికి ఉద్యోగ భద్రత కల్పించడం కోసమే నిబంధనలు మార్చుతున్నట్లు యూకే ప్రకటించింది. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విదేశాల్లో విద్యను అభ్యసించడానికి వెళ్లిన విద్యార్థుల సమస్యలను పరిష్కరించి, సాయం చేసేందుకు ఇండియన్ ఎంబసీలు, కాన్సులేట్లతో పాటు హెల్ప్ లైన్ సెంటర్లు, వాట్సప్ సర్వీసులు, డిజిటల్ ఫ్లాట్ ఫారం లను అందుబాటులోకి తెచ్చింది. పని లభించక ఒత్తిడికి గురై ఇబ్బందులు పడుతున్న వర్కర్ల కోసం స్పెషల్ లేబర్ విభాగాలు, ప్రత్యేక క్యాంపులను ఇండియన్ కమ్యూనిటీ ఫండ్స్ తో నిర్వహిస్తున్నారు. ప్రపంచ దేశాల ఇమ్మిగ్రేషన్ విధానాల మార్పు మూలంగా భారతీయులు ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు అన్ని రకాలు చర్యలు తీసుకుంటున్నారు.

Latest News