• Telugu News
  • /News

John Wesley : వరద బాధితులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి

కామారెడ్డి వరద బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం, త్రాగునీరు, ఆహారం, విద్యుత్ సౌకర్యాలు అందించాలి.

Reported by: Tejaswini Nanna | వార్త‌లు | Aug 29, 2025, 6:55 pm IST
Read Time: 5 mins
John Wesley : వరద బాధితులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి

John Wesley | విధాత : వరదలతో నష్టపోయిన బాధితులను తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. శనివారం కామారెడ్డి పట్టణంలో వరద ముంపుకు గురైన ప్రాంతాలను సీపీఎం రాష్ట్ర బృందం సందర్శించింది. రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ వెంట పార్టీ రాష్ట్ర నాయకులు డీజే నరసింహారావు, ఆర్ వెంకట్ రాములు, శోభన్‌ నాయక్ లతో పాటు పార్టీ జిల్లా కమిటీ బృందం పర్యటించింది. వరదల వల్ల బీఆర్ నగర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, జిఆర్ కాలనీ కౌండిన్య నగర్ లలో జాన్ వెస్లీ బృందం ఇంటింటికి తిరిగి ప్రజలతో మాట్లాడింది. అదే సందర్భంలో అక్కడికి వచ్చిన కలెక్టర్ ను సహాయక చర్యలపై ప్రశ్నించారు. కనీసం ప్రజలకు త్రాగడానికి మంచి నీళ్లు, ఆహారం, కరెంటు అందుబాటులోకి తేవాలని అన్నారు. వరదలో కొట్టుకొచ్చిన రాళ్లు రప్ప చెత్తాచెదారం ఇళ్లలోకి చేరి బురదమయం అయ్యాయని కలెక్టర్ కు వివరించారు. ఇంట్లోకి పాములు కూడా వస్తున్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలో వరదను అంచనా వేయడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేసుంటే ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగి ఉండేది కాదని అన్నారు. వందలాది ఇండ్లలోకి వరద నీరు చేరి నిత్యవసర వస్తువులన్నీ కొట్టుకుపోయాయని తెలిపారు. ఫస్ట్ ఫ్లోర్ వరకు అన్ని ఇండ్లు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో వందలాది కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డారని వారికి జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం తక్షణంగా భోజన సౌకర్యాలు, నీటి సౌకర్యాలు కల్పించాలని, వారికి నష్టపరిహారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో దెబ్బతిన్న పంట పొలాలను, రోడ్లను వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి కేంద్ర బృందాన్ని పంపించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలని, కామారెడ్డి జిల్లాకు 2000 కోట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి శాసనసభ్యులు కూడా దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని తెలిపారు.

కామారెడ్డి పట్టణంలో జిల్లా వ్యాప్తంగా కూడా వరదల వల్ల అనేక గ్రామాల్లో విద్యుత్ సౌకర్యాలు లేక త్రాగునీరు లేక ఎటు వెళ్లలేని పరిస్థితిలో ప్రజలు వెల్లదీస్తున్నారని, వెంటనే ప్రభుత్వం స్పందించి అలాంటి గ్రామాలను గుర్తించి వారికి తక్షణం ఆహారం మీరు అదే విధంగా చర్యలు తీసుకోవాలని సీపీఎం పార్టీ బృందం జిల్లా కలెక్టర్ ఆశిష్ ను కోరింది. జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే చర్యలు చేపడతామని చెప్పారు.