విధాత : ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరేందుకు టీవీకే చీఫ్ విజయ్ ముచ్చటగా మూడోసారి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ను కలిశారు. ఈ రోజు సాయంత్రం 4:30కి గవర్నర్ తో విజయ్ మరోసారి భేటీ అయ్యారు. ఇప్పటికే రెండుసార్లు గవర్నర్ ను కలిసిన విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ మార్క్ 118 మంది ఎమ్మెల్యే మద్దతును ప్రదర్శించడంతో ఆయనను సంతృప్తి పరుచలేకపోయారు. ఈ సారి మాత్రం గవర్నర్ అడిగినట్లు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతును చూపించి గవర్నర్ కు బలనిరూపణ చేశారు. దీంతో గవర్నర్ విజయ్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి అనుమతించారు. రేపు శనివారం ఉదయం 11గంటలకు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం ఆయన అసెంబ్లీలో బలనిరూపణ చేసుకుంటారు.
విజయ్ కి మద్దతుపై వామపక్షాలు, వీసీకే సై…
అయితే నేటీ సాయంత్రం గవర్నర్ తో జరిగే భేటీకి ముందు విజయ్ మద్దతు కోసం వామపక్షాలు, వీసీకే పార్టీల నాయకత్వంతో చర్చలు జరిపారు. విజయ్ కి మద్దతునిచ్చేందుకు ఎట్టకేలకు సీపీఐ, సీపీఎం, వీసీకే అంగీకరించాయి. ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్ మద్దతిచ్చిన విషయం తెలిసిందే. టీవీకే 107, కాంగ్రెస్ 5, సీపీఐ 2, సీపీఎం 2, వీసీకే 2 సీట్లు ఉన్నాయి. వీరందరి మద్దతుతో టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ నంబర్ 118 లభించనుంది. అలాగే ఒక సీటు ఉన్న డీఎండీకే తో కూడా విజయ్ చర్చించారు. దీంతో వారంతా మరికాసేపట్లో టీవీకేకు మద్దతుపై అధికారికంగా ప్రకటన చేయనున్నారు. అలాగే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న ఐయూఎంఎల్ కూడా టీవీకేకు మద్దతు ప్రకటించింది. దీంతో టీవీకేకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల బలం 121కి చేరింది. అయితే వామపక్షాలు మాత్రం తాము మంత్రివర్గంలో చేరబోమని, బయటనుంచే మద్దతు ప్రకటిస్తామని స్పష్టం చేశాయి. మొత్తం మీద విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం లభించడంతో ఆయన అభిమానులు, టీవీకే శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.