HYD METRO | హైదరాబాద్ మెట్రో: టైమింగ్స్ పెంచారు.. ఆ ఆఫర్లు కట్ చేశారు

విధాత : హైదరాబాద్ నగర రవాణాలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఎల్&టి మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ (ఎల్&టిఎమ్ఆర్హెచ్ఎల్) ప్రయాణికులకు కొత్తగా డిజిటల్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా, సులభంగా ప్రయాణించేందుకు వీలుగా డిజిటల్ సేవలను ఆవిష్కరించింది. ప్రయాణికుల కోసం కొత్త టి-సవారీ మొబైల్ అప్లికేషన్ను, నూతనంగా రూపొందించిన హైదరాబాద్ మెట్రో ప్రయాణీకుల వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చింది.
రైలు సమయాల పొడిగింపు
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైలు సమయాలను పొడిగించింది. ఏప్రిల్ 1, 2025 నుంచి టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి రైలు రాత్రి 11:45 గంటలకు బయలుదేరుతుంది. ఏప్రిల్ 1 నుంచి ఉదయం 6గంటల నుంచి రాత్రి 11: 45వరకు మెట్రో సర్వీస్ లు నడుస్తాయి. అలాగే, ఆదివారాల్లో మొదటి రైలు ఉదయం 7 గంటలకు బయలుదేరుతుంది. అదేవిధంగా విద్యార్థుల కోసం ప్రత్యేక ఆఫర్ను మరో ఏడాది పొడిగించింది. 20 ట్రిప్పులు చెల్లిస్తే 30 ట్రిప్పులు ప్రయాణించే అవకాశం మార్చి 31, 2026 వరకు అందుబాటులో ఉంటుంది. ఇక ఇతర ఆఫర్లు సూపర్ సేవర్ హాలిడే ఆఫర్, ఆఫ్-పీక్ డిస్కౌంట్ ఆఫర్ మార్చి 31, 2025తో ముగుస్తాయి.
మెరుగైన సేవలకు చర్యలు : మెట్రో ఎండీ
హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్.వి.ఎస్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ మెట్రో కేవలం రవాణా వ్యవస్థ మాత్రమే కాదని, నగర అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. మెట్రో ఫెస్ట్, మెట్రో మెడ్లీ, ఆర్ట్ ఫెస్ట్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరుస్తున్నామని తెలిపారు. ఎల్&టిఎమ్ఆర్హెచ్ఎల్ ఎండీ, సీఈఓ కెవిబి రెడ్డి మాట్లాడుతూ, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించడానికి డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. టి-సవారీ యాప్, కొత్త వెబ్సైట్ ద్వారా హైదరాబాద్ మెట్రోను డిజిటల్గా మరింత అభివృద్ధి చేశామని చెప్పారు. మరింత సమాచారం కోసం , www.ltmetro.comని సందర్శించండని సూచించారు.