Manda Krishna Madiga: అన్ని ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు నిలిపివేయండి.. సీఎం రేవంత్ రెడ్డికి మందకృష్ణ లేఖ!

Reported by: sr | వార్త‌లు | Mar 08, 2025, 7:14 pm IST
Read Time: 3 mins
Manda Krishna Madiga: అన్ని ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు నిలిపివేయండి.. సీఎం రేవంత్ రెడ్డికి మందకృష్ణ లేఖ!

Manda Krishna Madiga

విధాత: రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పూర్తిగా జరిగే వరకు అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలను నిలిపివేయాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy) కి ఆయన బహిరంగ లేఖ రాశారు.

ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున అందులో చట్టం చేస్తామని హామీ ఇచ్చారని.. మరో వైపు గ్రూప్ 1, గ్రూప్ 2 , గ్రూప్ 3 పరీక్ష ఫలితాలు విడుదల విడుదల చేస్తామని టీజీపీఎస్సీ నుండి పత్రిక ప్రకటన చేయించిన తర్వాత మా జాతి ప్రజలు మరోసారి మోసానికి గురవుతున్నారని భావిస్తున్నారని మందకృష్ణ లేఖలో పేర్కొన్నారు.

ఒకవేళ అదే జరిగితే మేము మరింత నష్టపోయే ప్రమాదం ఉందని..ఇంతకుముందు 11 వేల డీఎస్సీ పోస్టులు భర్తీ చేయడం వలన మేము ఎన్ని పోస్టులు నష్టపోయామో మీకు తెలిసిందేనని.. ఎస్సీ వర్గీకరణ పోరాటానికి ఫలితం రాబోతుందనుకునే సమయంలో వర్గీకరణ లేకుండా ఉద్యోగ పోటీ పరీక్ష ఫలితాల ప్రకటనలు జరిగితే మాదిగలే కాదు.. ఇతర కులాలు కూడా సహించవన్నారు. దయచేసి ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యే వరకు అన్ని పోటీ పరీక్షలను నిలిపివేయండని మంద కృష్ణ విజ్ఞప్తి చేశారు.