Errabelli Dayakar Rao
- లడక్ వెళ్ళి శిక్షణ ఇచ్చి వచ్చిన మహిళలతో మంత్రి ఎర్రబెల్లి ముఖాముఖి
- డ్వాక్రా సంఘాల పొదుపు, నిర్వహణ, శిక్షణలో మనమే మేటి
- ఎన్టీఆర్ మహిళా సంఘాలను పెడితే బలోపేతం చేసింది సీఎం కెసిఆర్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: శభాష్! మీ పని తీరు అద్భుతంగా ఉంది. మీ అనుభవాలను, నిర్వహణ సామర్ధ్యాలను కలిపి, దేశంలోని మిగతా మహిళా సంఘాలకు ఇస్తున్న శిక్షణ గొప్పగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. గొప్ప కార్యాన్ని నిర్వర్తిస్తూ, దేశానికే ఆదర్శంగా నిలిచిన మహిళా మణులందరికీ అభినందనలు తెలియజేశారు. ఇటీవల లడక్ వెళ్ళి అక్కడ శిక్షణ ముగించి వచ్చిన హనుమకొండకు చెందిన పేదరిక నిర్మూలన సంస్థ ఓరుగల్లు మహా సమాఖ్య కు చెందిన 15 మంది మహిళలతో మంత్రి హనుమకొండలో ముఖా ముఖి సమావేశమయ్యారు. వారితో గంటన్నరపాటు చర్చించారు. సాధించిన ప్రగతిని చూశారు. వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. వారు శిక్షణ ఇస్తున్న తీరు తెన్నులను అడిగారు. వారికి ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. ఏండ్లుగా వారు నిర్వహిస్తున్న శిక్షణ పద్ధతులను తెలుసుకున్నారు. వారిని శభాష్! మీ పని తీరు బాగుంది. మీరు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారంటూ అభినందించారు.
– మంత్రికి అనుభవాలు వివరించిన మహిళలు
ఈ సందర్భంగా పలువురు మహిళలు వారి వారి అనుభవాలను మంత్రికి వివరించారు. మంత్రి అడిగిన ప్రశ్నలకు వారు సమాధానం చెప్పారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన 10 ఉత్తమ ప్రగతి సాధించిన ఆదర్శ సంఘాలతో కలిపి ఓరుగల్లు పరస్పర సహాయక సహకార మహా సమాఖ్యగా ఏర్పడింది. 18 ఏండ్లుగా ఈ సమాఖ్య పని చేస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాదుల ఏర్పాటు ద్వారా పేదరిక నిర్మూలన మరియు మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నాయి. 2015లో ఈ సమాఖ్య తెలంగాణలో ఏకైక జాతీయ స్థాయి మానవ వనరుల సంస్థగా జాతీయ గుర్తింపును పొందింది.ఈ సంస్థలోని దాదాపు 460 మంది రిసోర్స్ పర్సన్స్ తగు శిక్షణ పొంది, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తమ అనుభవాలను రంగరించి శిక్షణ ఇస్తున్నారు.
– మహిళా అభివృద్ధికి సర్కారు కృషి
అప్పట్లో ఎన్టీ రామారావు డ్వాక్రా సంఘాలను పెట్టారు. వాటిని సీఎం కెసిఆర్ బలోపేతం చేశారని మంత్రి ఎర్రబెల్లి కొనియాడారు. అప్పట్లో అతి కొద్ది మొత్తం పొదుపు చేయడంతో ప్రారంభమై ఇవ్వాళ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో 4,35,364 స్వయం సహాయక సంఘాలలో 45,60,518 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారన్నారు. దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున సంఘటితమైన మహిళలు తెలంగాణలో తప్ప ఎక్కడా లేరన్నారు. మహిళలు బాగుపడితే, ఆ కుటుంబం, సమాజం, గ్రామం, రాష్ట్రం, దేశం బాగుపడుతుందని తెలిపారు. అందుకే సిఎం కెసిఆర్ డ్వాక్రా సంఘాలను బలోపేతం చేస్తున్నారని తెలిపారు. అనేక రుణాలు ఇప్పిస్తూ, మహిళలను పారిశ్రామికంగా ఎదిగేవిధంగా చేస్తున్నారు. అనేక పథకాలను మహిళల పేరునే, వారికే వర్తించే విధంగా చర్యలు తీసుకున్నారు. అందుకే ఇవ్వాళ మన మహిళా సంఘాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని మంత్రి వివరించారు. మహిళా సంఘాలు, అలాగే ఓరుగల్లు మహిళా సమాఖ్య ఇదే పని తీరును కొనసాగిస్తూ, ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతోపాటు వరంగల్ జెడ్పీ ఇన్ చార్జీ సిఇఓ, వరంగల్ డిఆర్ డిఓ సంపత్ రావు, సెర్ప్ కు చెందిన తక్కెళ్ళపల్లి రవిందర్ రావు, ఓరుగల్లు మహా సమాఖ్య కు చెందిన మహిళలు, రిసోర్స్ పర్సన్స్, సీనియర్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్, రాష్ట్ర స్థాయి కమ్యూనిటీ ట్రైనర్స్, ప్రొఫెషనల్ రిసోర్స్ పర్సన్స్, ఎలక్ట్రానిక్ మాస్టర్ ట్రైనర్స్ తదితరులు పాల్గొన్నారు.