గాంధీ సిద్ధాంతాలతోనే పార్టీ ముందుకు: మీనాక్షి నటరాజన్

విధాత: కాంగ్రెస్ జాతీయ పార్టీ అని, జాతీయ స్థాయి ఆలోచనలతోనే..గాంధీ సిద్ధాంతాలతోనే పార్టీ ముందుకు సాగుతుందని ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. హైదరాబాద్ ఇందిరాభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పరిశీలకుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్టీ సిద్ధాంత ప్రచారం, సంస్థాగత పటిష్టత గ్రామస్థాయి నుంచి జరగాలని సూచించారు. ఈ విషయంలో పార్టీ నాయకత్వం చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని గుజరాత్ మోడల్ గా చేపట్టాలని అధినాయకత్వం నిర్ణయించిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను విస్తారంగా జనంలోకి పోవాలని అన్నారు.
సిద్ధాంత పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశంలోనే మొదటి సారిగా తెలంగాణలో కులగణన, 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ చేపట్టడం చరిత్రాత్మకమని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. ప్రభుత్వం విప్లవాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలను మనం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ పదవుల్లో సీనియర్లకు పెద్ద పీట వేయనున్నామని..2017 నుంచి పార్టీలో ఉన్న వారికే పదవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. పార్టీ నాయకత్వంలో మహిళల ప్రాతినిధ్యం పెరగాలని సూచించారు.
సంస్థాగత నిర్మాణానికి ఇంచార్జిలు
మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం కోసం జిల్లాకు ఇద్దరు అబ్జర్వర్లను నియమిస్తున్నట్టు మీనాక్షి నటరాజన్ తెలిపారు. ప్రతి మండలం నుంచి పార్టీ మండలాధ్యక్ష పదవి కోసం ఐదుగురి పేర్లను పంపాలని సూచించారు. అదే విధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం మూడు పేర్లను పీసీసీకి పంపాలని అబ్జర్వర్ల కు సూచించారు. ఏప్రిల్ 25 నుంచి 30 వరకు జిల్లా స్థాయి సమావేశాలు, మే 4 నుంచి 10వ తేదీ వరకు అసెంబ్లీ/బ్లాక్ లెవల్ మీటింగ్, మే 13 నుంచి 20వ తేదీ వరకు మండల స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ఈ సమావేశానికి 70 మంది అబ్జర్వర్లను ఆహ్వా నించగా..మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో పాటు మరో ఐదుగురు హాజరుకాలేదు. దీంతో వారిని పరిశీలకుల పదవి నుంచి తొలగించారు. అదే విధంగా మీటింగ్ కు ఆలస్యంగా వచ్చిన వారిపైనా వేటు పడింది.