గిరిజనుల సాంప్రదాయ జీవనోపాధి, వైవిధ్య, ప్రత్యామ్నాయ జీవనోపాధిపై అధ్యయనంఅవార్డు ప్రదానం చేసిన ఆంధ్రా యూనివర్శిటి అమరావతి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణం జిల్లాలోని సాంప్రదాయ గిరిజన తెగలు, వాటి సాంప్రదాయ, వైవిధ్య, ప్రత్యామ్నాయ జీవనోపాధి అంశంపై చేసిన పరిశోధనకుగాను రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ మీసాల రాజగోపాలనాయుడు (ఎంఆర్జి నాయుడు)కు ఆంధ్రా యూనివర్శిటీ డాక్టరేట్ (పిహెచ్డి) ప్రదానం చేసింది. ఈ పరిశోధనలో ఆంధ్రా యూనివర్శిటీకి చెందిన పర్యావరణ శాస్త్ర విభాగం ప్రొఫెసర్ టి. భైరాగిరెడ్డి గైడ్గా, ప్రొ. ఈ.ఉదయ భాస్కర్రెడ్డి (రిటైర్డ్)సహ […]
గిరిజనుల సాంప్రదాయ జీవనోపాధి, వైవిధ్య, ప్రత్యామ్నాయ జీవనోపాధిపై అధ్యయనం
అవార్డు ప్రదానం చేసిన ఆంధ్రా యూనివర్శిటి
అమరావతి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణం జిల్లాలోని సాంప్రదాయ గిరిజన తెగలు, వాటి సాంప్రదాయ, వైవిధ్య, ప్రత్యామ్నాయ జీవనోపాధి అంశంపై చేసిన పరిశోధనకుగాను రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ మీసాల రాజగోపాలనాయుడు (ఎంఆర్జి నాయుడు)కు ఆంధ్రా యూనివర్శిటీ డాక్టరేట్ (పిహెచ్డి) ప్రదానం చేసింది. ఈ పరిశోధనలో ఆంధ్రా యూనివర్శిటీకి చెందిన పర్యావరణ శాస్త్ర విభాగం ప్రొఫెసర్ టి. భైరాగిరెడ్డి గైడ్గా, ప్రొ. ఈ.ఉదయ భాస్కర్రెడ్డి (రిటైర్డ్)
సహ గైడ్గా తోడ్పాటునందించారు.
1983 జనవరి 21న పార్వతీపురం ఐటిడిఎలో అసిస్టెంట్ ఇంజనీర్గా చేరిన మీసాల రాజగోపాలనాయుడు గిరిజనులను అతి సన్నిహితంగా అధ్యయనం చేశారు. గిరిజన సంక్షేమ శాఖలో 1999 వరకు AE గా DEEగా పనిచేశారు, తరువాత వరంగల్లో, ఈఈగా శ్రీశైలం, సీతంపేట, పాడేరులతో సుదీర్ఘ కాలం పనిచేశారు. గిరిజన సంక్షేమశాఖలోనే చీఫ్ ఇంజినీర్గా, ఈఎన్సిగా పనిచేసి 2018 ఏప్రిల్ 30న పదవి విరమణ చేశారు.
తన ఉద్యోగ జీవితమంతా గిరిజనులతో కలిసి, గిరిజనుల ఆరోగ్యం, అభివృద్ధి, ఆదాయ మార్గాల పెంపు, జీవన విధానంపై విస్తృతమైన అధ్యయనం చేశారు ఎమ్మార్జీ నాయుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 23 జిల్లాల్లోని గిరిజనులతో, వారి ఆహారం, సంస్కృతి, అలవాట్లతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నారు. 1983-2018 వరకు తన సర్వీసు పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ధతో అధ్యయనం చేశారు. గొప్ప పర్యావరణ ప్రేమికుడు కావడం వల్ల ఎమ్మార్జీ నాయుడు ఆ రంగంలో మొదటి నుంచి విస్తృతమైన అవగాహన కలిగి ఉన్నారు. గిరిజన ప్రాంతాల్లో వాతావరణ మార్పులు, విపత్తులు, ఎపిడిమిక్స్ సంబంధిత సమస్యలను అతి సన్నిహితంగా చూసి ఆకలింపు చేసుకున్నారు. వాతావరణ మార్పు, విపత్తుల సమయంలో గిరిజనులు ఎదుర్కొనే సమస్యలు, వాటి ప్రత్యామ్నాయాలను స్వయంగా రూపొందించి గిరిజనుల గుండెల్లో స్థానం సంపాదించారు.
సాధారణంగా గిరిజన సంక్షేమశాఖలో పనిచేసే క్లర్క్ స్థాయి ఉద్యోగి కూడా దగ్గరిలోని పట్టణాల్లో నివశించి, ఉద్యోగం వరకూ అక్కడికి వెళ్లి వస్తుంటారు. కానీ ఎమ్మార్జీ నాయుడు మాత్రం ఇంజినీరు అయి ఉండి గిరిజనులతోపాటు, వారి ఆవాసాల పక్కనే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన తన సొంత బిడ్డను సైతం సరైన వైద్యం చేయించలేక కోల్పోయారు. ఇది ఆయన చిత్తశుద్ధికి ఒక నిదర్శం మాత్రమే. తన ఉద్యోగ జీవితంలో గిరిజనులతో మమేకమైన అనుభవాల నేపథ్యంలో వారి జీవన పరిస్థితులపై, ప్రత్యామ్నాయ మార్గాలపై లోతైన అధ్యయనం చేయాలని భావించారు. పదవీ విరమణ చేసిన తరువాత దీనిపై ఎంతో శ్రమకోర్చి అధ్యయనం చేసి అనేక ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలు, అడ్డంకులు ఎదుర్కొనే మార్గాలతో తన పరిశోధనలో పొందిపరిచారు.
విజయనగరం జిల్లా గరివిడి మండలం కోనూరు గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఎమ్మార్జీ నాయుడు తన జీవితాన్ని కూడా స్వయంగా దిద్దుకుని ఉన్నత స్థానాలను అలంకరించిన స్వయంకృషీవలుడు. నిబద్ధతతో కూడిన ఉద్యోగ జీవితం,నిజాయితీతో కూడిన ఆచరణ ఆయన్ను ఉద్యోగ జీవితంలో ఉన్నత శిఖరాల వరకూ తీసుకెళ్లాయి. వయసు శరీరానికేకానీ, మనసుకు కాదని తలచే నాయుడు…ప్రభుత్వ ఉద్యోగుల పని విధానానికి భిన్నంగా పనిచేసి అనేకమంది పెద్దల ప్రశంసలు, అభినందనలు పొందారు.
గిరిజనుల సాంప్రదాయ జీవనోపాధి, వైవిధ్య, ప్రత్యామ్నాయ జీవనోపాధిపై ఎమ్మార్జీ నాయుడు చేసిన అధ్యయనం గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని, భవిష్యత్లో ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అన్న దానికి మార్గదర్శిగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు పర్యావరణ వేత్తలు.