విధాత: కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే శాంతి చర్చలకు ముందుకు వస్తామంటూ మావోయిస్టు పార్టీ సంచలన లేఖను విడుదల చేసింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదలైన లేఖలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలపై సానుకూలంగా స్పందించాలని కోరింది. శాంతి చర్చలకు ప్రభుత్వాలు ప్రతిపాదిస్తే కాల్పుల విరమణ ప్రకటిస్తామని మావోయిస్టు పార్టీ వెల్లడించింది. ‘మధ్యభారతంలో జరుగుతున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలి, భారత ప్రభుత్వం-సీసీఐ (మావోయిస్టు) బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు జరపాలి’ అనే అంశంపై మార్చి 24న హైదరాబాద్ లో శాంతి చరల కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిందని అభయ్ గుర్తు చేశారు. నేటి స్థితిలో శాంతి చర్చల కమిటీ ఏర్పాటును, అది శాంతి కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడాన్ని మేము స్వాగతిస్తున్నాం, ఈ సందర్భంగా, శాంతి చర్చల పట్ల మా పార్టీ వైఖరిని తెలియజేస్తున్నామని అభయ్ లేఖలో పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు దేశ ప్రజలపై కగార్ పేరుతో యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయని, విప్లవోధ్యమ ప్రాంతాల్లో ఆదివాసీ యువతి యువకులను సాయుధ బలగాల్లో భర్తీ చేసుకుని వారిచేతనే ఆదివాసీలను హత్యలు చేయిస్తున్నారని అభయ్ ఆరోపించారు. ఈ స్థితిలో ప్రజల ప్రయోజనాల కోసం మేము ఎప్పుడైనా శాంతి చర్చలకు సిద్ధమని..అందుకే శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు ప్రతిపాదన చేస్తున్నామని పేర్కొన్నారు. అందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కగార్ పేరుతో ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర (గడ్చిరోలీ), ఒడిశా, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చేస్తున్న హత్యకాండలను, నరసంహారాన్ని (జీనోసైడ్)ను నిలిపివేయాలని, సాయుధ బలగాల కొత్త క్యాంపుల ఏర్పాటును ఆపివేయాలని ప్రతిపాదిస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందిస్తే మేం తక్షణమే కాల్పుల విరమణ ప్రకటిస్తామని అభయ్ ప్రకటించారు.
మేము చేస్తున్న ఈ ప్రతిపాదనల ఆధారంగా శాంతి చర్చల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుక రావాలని శాంతి చర్చల కమిటీకి, దేశంలోని ప్రజాపక్ష మేధావులకు, రచయితలకు, ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టులకు, హక్కుల సంఘాలకు, ఆదివాసీ, దళిత సంఘాలకు, విద్యార్థి యువజనులకు, పర్యావరణ కార్యకర్తలకు తదితరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. శాంతి చర్చల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేలా దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో, నగరాల్లో, జిల్లా, తాలూకా కేంద్రాల్లో, యూనివర్సిటీల్లో ప్రచార క్యాంపెయిన్ ను చేపట్టాల్సిందిగా కోరుతున్నామని తెలిపారు.