తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ప్రారంభమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సీపీఐ స్టేట్ కౌన్సిల్ సమావేశంలో కూనంనేని మాట్లాడుతూ…కాంగ్రెస్ పాలనపై రాష్ట్రంలో అసంతృప్తతి ప్రారంభమైందని, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ గత తప్పుల నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లలేకపోతుందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదు అని స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో బలపడేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని, బీజేపీని ఓడించాలంటే మిలిటెంట్ పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ పార్టీలతో పొత్తులు ఎన్నికలకే పరిమితం అని, ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఆగస్టు 6 నుంచి 14 వరకు తెలంగాణ వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్రలు కొనసాగిస్తామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపైన, ప్రజా సమస్యలపైన సీపీఐ పాదయాత్రల ద్వారా పోరాటం చేస్తుందని కూనంనేని తెలిపారు.