Paytm Pocket Money | బ్యాంక్ ఖాతా లేకుండానే యూపీఐ సేవలు.. టీనేజర్ల కోసం పేటీఎం సరికొత్త ఫీచర్!

Paytm Pocket Money | టీనేజర్లు, కాలేజీ స్టూడెంట్స్‌ను దృష్టిలో ఉంచుకుని పేటీఎం సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. Paytm Pocket Money పేరుతో కొత్త సేవలను ప్రారంభించింది. ఈ సేవల ద్వారా బ్యాంక్ ఖాతా లేకపోయినప్పటికీ టీనేజర్లు స్వతంత్రంగా యూపీఐ చెల్లింపులు చేయవచ్చు.

Paytm Pocket Money | బ్యాంక్ ఖాతా లేకుండానే యూపీఐ సేవలు.. టీనేజర్ల కోసం పేటీఎం సరికొత్త ఫీచర్!

Paytm Pocket Money | టీనేజర్లు, కాలేజీ స్టూడెంట్స్‌ను దృష్టిలో ఉంచుకుని పేటీఎం సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. Paytm Pocket Money పేరుతో కొత్త సేవలను ప్రారంభించింది. ఈ సేవల ద్వారా బ్యాంక్ ఖాతా లేకపోయినప్పటికీ టీనేజర్లు స్వతంత్రంగా యూపీఐ చెల్లింపులు చేయవచ్చు. మరి ఈ ఫీచర్ ఏంటి? ఎలా పనిచేస్తుంది? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

పాకెట్ మనీ అంటే ఏంటి?

ఇప్పటివరకు పిల్లలు, టీనేజర్లు డిజిటల్ చెల్లింపులు చేయాలంటే తల్లిదండ్రుల మొబైల్, ఓటీపీలు లేదా వారి బ్యాంక్ ఖాతాలపైనే ఆధారపడాల్సి వచ్చేది. కానీ కొత్తగా తీసుకొచ్చిన పాకెట్ మనీ ఫీచర్‌తో ఆ అవసరం ఉండదు. టీనేజర్లు తమ మొబైల్‌ ఫోన్ నుంచే యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రవేశపెట్టిన యూపీఐ సర్కిల్ (UPI Circle) సౌకర్యంపై ఆధారపడి పనిచేస్తుంది.

గత ఏడాది ఆగస్టులో ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ ద్వారా ప్రైమరీ యూపీఐ వినియోగదారుడు తన బ్యాంక్ ఖాతా నుంచి తన ఫ్యామిలీ మెంబర్ లేదా స్నేహితుడికి యూపీఐ యాక్సెస్ ఇవ్వగలుగతారు. దీని ద్వారా సదరు వ్యక్తి తమకు సొంత బ్యాంక్ ఖాతా లేకుండానే చెల్లింపులు చేయవచ్చు. స్కూల్, కాలేజీ క్యాంటీన్లు, క్యాబ్ చార్జీలు, మెట్రో ప్రయాణాలు, మొబైల్ రీచార్జిలు, కిరాణా షాపుల్లో కొనుగోళ్లు, ఇతరత్రా చిన్న చిన్న ఖర్చుల కోసం దీన్ని ఉపయోగించవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే మన చేతికి నెలవారీ ఇచ్చే పాకెట్ మనీకి డిజిటల్ రూపమే ఈ సరికొత్త ఫీచర్ అని చెప్పవచ్చు.

ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?

ఈ కొత్త ఫీచర్ ప్రకారం తల్లిదండ్రులు తమ మొబైల్‌లోని పేటీఎం యాప్ ద్వారా టీనేజర్లను ఆహ్వానించి యూపీఐ సర్కిల్ ద్వారా కనెక్ట్ చేయాలి.

  • ఈ ఫీచర్ యాక్టివేట్ చేసుకోవడానికి ముందుగా పేటీఎం యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత యాప్‌లోని To Mobile/Contact విభాగంలోకి వెళ్లి Pocket Money ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • అనంతరం ఎవరికైతే పాకెట్ మనీ సదుపాయం కల్పించాలని అనుకుంటున్నామో సదరు వ్యక్తి మొబైల్ నంబర్ లేదా యూపీఐ ఐడీ ఎంటర్ చేయాలి. అవసరమైన ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయాలి.
  • ధృవీకరణ పూర్తయ్యాక నెలవారీ ఖర్చు పరిమితి నిర్ణయించి, ప్రధాన బ్యాంక్ ఖాతాను ఎంపిక చేసి యూపీఐ పిన్ నమోదు చేస్తే సరిపోతుంది. అప్పుడు పాకెట్ మనీ యాక్టివేట్ అవుతుంది.
  • అప్పుడు ఎవరికైతే ఈ సేవను యాక్టివేట్ చేశామో, వారి మొబైల్‌కు ఒక రిక్వెస్ట్ నోటిఫికేషన్ వెళ్తుంది. దాన్ని యాక్సెప్ట్ చేస్తే పేటీఎం పాకెట్ మనీ సేవలు ప్రారంభమవుతాయి.

తల్లిదండ్రుల పర్యవేక్షణతో.. పూర్తిగా సేఫ్!

ఇలా తల్లిదండ్రుల ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ నుంచి పిల్లలకు యూపీఐ సేవలకు యాక్సెస్ ఇస్తే డబ్బులు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని అనుమానం రావచ్చు. దీనికోసమే ఇందులో తల్లిదండ్రులకే పూర్తి పర్యవేక్షణను అప్పగించారు. ఇందులో తమ పిల్లల నెలవారీ ఖర్చులను నియంత్రించవచ్చు. పేటీఎం స్పెండ్ సమ్మరీ ద్వారా రియల్ టైమ్‌లో పిల్లల యూపీఐ ట్రాన్సక్షన్‌ను ట్రాక్ చేయవచ్చు. ఖర్చుల వివరాలను పరిశీలించవచ్చు.

ఈ ఫీచర్ ద్వారా ఒకేసారి గరిష్టంగా రూ.5 వేల వరకు మాత్రమే ఖర్చు చేయవచ్చు. నెల మొత్తంలో రూ.15వేలకు మించి ఖర్చు చేయకుండా నియంత్రణ పెట్టవచ్చు. అవసరమైతే పరిమితులను మార్చవచ్చు. ఎప్పుడైనా యాక్సెస్ నిలిపివేయవచ్చు.

భద్రత కోసం ప్రత్యేక చర్యలు

పేటీఎం పాకెట్ మనీ ఫీచర్‌లో సెక్యూరిటీకి సంబంధించి పలు నిబంధనలను అమలు చేశారు. దీని ప్రకారం.. ఈ ఫీచర్ ప్రారంభించిన తొలి 30 నిమిషాల్లో గరిష్టంగా రూ.500 వరకు మాత్రమే చెల్లించవచ్చు. అలాగే తొలి 24 గంటల్లో రూ.5 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్ జరగకుండా పరిమితి విధించారు. ఈ ఫీచర్ ద్వారా చిన్న వయసులోనే డబ్బు వినియోగంపై పిల్లల్లో అవగాహన వస్తుందని.. ఆర్థిక క్రమశిక్షణ పెంపొందించవచ్చని పేటీఎం సంస్థ భావిస్తోంది.

Read More:

నెలకు రూ.5వేలు ఇన్వెస్ట్ చేస్తే లక్షల్లో సేవింగ్స్.. చక్రవడ్డీతో భారీ రాబడి ఇచ్చే పోస్టాఫీసు స్కీమ్

కస్టమర్ దెబ్బకు దిగొచ్చిన బ్యాంక్.. రూ.3.21లక్షల పరిహారంతో సెటిల్‌మెంట్!