మంచి అవకాశం మించిన దొరకదు అనుకున్నారు పంజాబ్ గ్యాంగ్ అంతా ఫస్ట్ ఇన్నింగ్స్లో తక్కువ స్కోరుకే చెన్నైని పరిమితం చేసాక. కానీ, అక్కడ వికెట్ల వెనుక ఉన్నది ఓ మాస్టర్మైండ్. బౌలింగ్, ఫీల్డింగ్ వ్యూహాలు మార్చి, మార్చి తాము చేసిన ఆ తక్కువ స్కోరును కూడా కాపాడుకున్నాడు.
ఐపిఎల్–2024లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్, చెన్నైజట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చెన్నై 28 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పీకే జట్టు మంచి నిర్ణయమే తీసుకుంది. తమ బౌలర్ల ధాటికి చెన్నై బ్యాటర్లు విలవిలలాడారు. ఒక్కో పరుగు చేయడానికి చాలా కష్టపడ్డారు. కెప్టెన్ గైక్వాడ్(32), డారిల్ మిచెల్(30), జడేజా(43)తప్ప మిగిలినవారంతా తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. డాషింగ్ బ్యాటర్ శివమ్ దూబే, మాస్టర్ ధోనీ గోల్డెన్ డక్ఔట్ కావడం విశేషం. మొత్తానికి చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగలగింది. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ (3), రాహుల్ చాహర్(3), అర్షదీప్ సింగ్(2) చెన్నై పతనాన్ని శాసించారు.
168 పరుగు స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ విజయం లాంభనమే అనుకున్నారంతా. కానీ, ధోనీ వ్యూహాల ముందు పంజాబ్ కెప్టెన్ సామ్ కరన్ ఆటలు ఫలించలేదు. జట్టు స్కోరు 9 పరుగులున్నప్పుడే హిట్టర్ ఓపెనర్ జానీ బెయిర్స్టో(7), ఆ తర్వాత వచ్చిన రిలీ రోసౌ(0) ఇద్దరూ అవుటవడంతో పంజాబ్ కష్టాలు మొదలయ్యాయి. ఈ ఇద్దరినీ తుషార్ దేశ్పాండే అద్భుతంగా క్లీన్ బౌల్డ్ చేసాడు. ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (30), శశాంక్సింగ్(27) కాసేపు పోరాడినా, రవీంద్ర జడేజా (3 వికెట్లు) దెబ్బకు కీలక బ్యాటర్లు పెవిలియన్ చేరారు. ఆ తర్వాత ఏ దశలోనూ పంజాబ్ కోలుకోలేదు. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. చెన్నై బౌలర్లలో జడేజా మూడు వికెట్లు తీసుకోగా, దేశ్పాండే, సిమర్జిత్ సింగ్ చెరో రెండు, శాంట్నర్, శార్డూల్ చెరో వికెట్ తీసుకున్నారు. దీంతో ప్లేఆఫ్ రేసు నుండి పంజాబ్ దాదాపు నిష్క్రమించినట్లే.