David Johnson : భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు, ఫాస్ట్‌ బౌలర్‌ డేవిడ్ జాన్సన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన మరణానికి సంతాపంగా భారత ఆటగాళ్లు గురువారం చేతికి నలుపు రంగు రిబ్బన్‌లు కట్టుకుని మ్యాచ్‌ ఆడారు. ‘T20 ప్రపంచ కప్ 2024’ సూపర్ ఎయిట్ దశలో గురువారం ఆఫ్ఘనిస్తాన్‌తో బార్బడోస్‌లో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా రోహిత్‌ సేన నల్ల రిబ్బన్‌లు ధరించింది.

టీమిండియా మాజీ క్రికెటర్‌, కర్ణాటక మాజీ ప్లేయర్‌ డేవిడ్‌ జాన్సన్‌.. బెంగళూరులో తాను నివాసముంటున్న అపార్ట్‌మెంట్‌ బాల్కనీ నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన 1996లో భారత జట్టు తరఫున రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడి మూడు వికెట్లు తీశాడు. దేశవాలీ కెరీర్‌లో 39 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 125 వికెట్లు పడగొట్టాడు.

డేవిడ్‌ జాన్సన్ అత్యంత వేగవంతమైన ఇండియన్‌ బౌలర్లలో ఒకరుగా నిలిచాడు. 1995-96 రంజీ సీజన్‌లో కేరళతో జరిగిన మ్యాచ్‌లో 152 పరుగులు ఇచ్చి 10 వికెట్లు తీసుకున్నాడు. దాంతో ఆయనకు భారత జట్టులో చోటు దక్కింది. కాగా జాన్సన్‌ గత కొంతకాలంగా తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.