T20 World Cup 2024 Ind Vs Australia | సగర్వంగా సెమీస్​లో భారత్

రోహిత్​ శర్మ సృష్టించిన పరుగుల సునామీలో ఆస్ట్రేలియా గల్లంతైంది. భారీ స్కోరు వేటలో వెనుకబడిన కంగారూలు ఓటమి పాలయ్యారు. దీంతో వారి సెమీస్​ ప్రవేశం అఫ్ఘన్​–బంగ్లాల ఫలితంపై ఆధారపడిఉంది. ఘనవిజయంతో సెమీస్​లో ప్రవేశించిన ఇండియా, ఫైనల్లో బెర్త్​ కోసం ఈనెల 27న ఇంగ్లండ్​తో తలపడనుంది.

T20 World Cup 2024  Ind Vs Australia | సగర్వంగా సెమీస్​లో భారత్

టి20 ప్రపంచకప్​ క్రికెట్ టోర్నీ(T20 World Cup 2024)లో భాగంగా భారత(India), ఆస్ట్రేలియా(Australia) జట్ల మధ్య జరిగిన ఆఖరి సూపర్​ 8(Super 8) మ్యాచ్​లో భారత్​ ఘనవిజయం సాధించి సగర్వంగా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. టాస్​ గెలిచి భారత్​కు బ్యాటింగ్​ అప్పగించిన కంగారూలు భారీ మూల్యమే చెల్లించుకున్నారు. కెప్టెన్​ రోహిత్​ శర్మ రికార్డుల వీర విహారంతో భారత్​ 205 పరుగుల భారీ స్కోరు నమోదు చేయగా, ఆసీస్​ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కష్టపడ్డా ఫలితం మాత్రం దక్కలేదు. చివరికి 24 పరుగుల తేడాతో పరాజయం పాలై, సెమీస్​ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. India won the match against Australia

భారత ఓపెనర్లలో కోహ్లీ(0) యథావిధిగా సున్నాకే అవుటవగా, రోహిత్​ శర్మ ఏమాత్రం తడబాటు లేకుండా యధేచ్చగా బ్యాట్​ ఝుళిపించాడు. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని మోతెక్కించాడు. 41 బంతుల్లో, 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 92 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.  కేవలం 19 బంతుల్లోనే అర్థసెంచరీ సాధించిన రోహిత్​(50 in 19 balls) ఈ టోర్నీలోనే వేగవంతమైన 50(Fastest Fifty in T20 WC 2024)గా రికార్డు స్థాపించాడు. అంతర్జాతీయ టి20 క్రికెట్​లో 200 సిక్సర్లు(200 Sixers) బాదిన ఓకే ఒక్కడిగా, ఒకే జట్టుపై అత్యధిక సిక్స్​లు కొట్టిన మొనగాడిగా రికార్డులు స్థాపించాడు.  మిచెల్​ స్టార్క్​ వేసిన 3వ ఓవర్​లో రోహిత్​ చెలరేగిపోయాడు. 4 సిక్స్​లు, ఒక ఫోర్​తో మొత్తం 29 పరుగులు పిండుకున్నాడు. స్టార్క్(Mitchell Starc)​ అంతర్జాతీయ టి20ల్లో ఇదే చెత్త ఓవర్​.  తర్వాత, సూర్యకుమార్​ యాదవ్​(31), దూబే(28), పాండ్యా(27) పరుగులు పారించి, భారత్​ భారీ స్కోరు చేయడంలో తమవంతు పాత్ర పోషించారు. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి భారత్​ 205 పరుగులు చేసింది. India 205/8

అనంతరం, భారీ లక్ష్యంతో బ్యాటింగ్​కు వచ్చిన ఆసీస్​కు ఆదిలోనే గట్టిదెబ్బ తగిలింది. ఓపెనర్​ వార్నర్​ 6 పరుగులకే పెవిలియన్​ చేరాడు. తర్వాత హెడ్​కు జతకలిసిన కెప్టెన్​ మార్ష్​(37) ఆటను గాడిలో పెట్టే ప్రయత్నం చేసాడు. ముఖ్యంగా హెడ్​(43 బంతుల్లో 76) చెలరేగిపోయి ఆడాడు. కానీ, ఆ తర్వాత ఎవరూ చెప్పుకోదగ్గ ఆటతీరు ప్రదర్శించలేకపోయారు. లక్ష్యం పెద్దదవడం, బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్​ చేయడంతో ఒత్తిడికి లోనైన కంగారూలు వికెట్లు పారేసుకున్నారు. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి ఓటమి పాలైంది(181/7). రేపు జరగబోయే అఫ్ఘనిస్తాన్​–బంగ్లాదేశ్​ మ్యాచ్​లో అఫ్ఘన్లు భారీ విజయం సాధిస్తే ఆసీస్​ ఇంటిముఖం పట్టక తప్పదు.