20 ఏళ్ల తెలుగు కుర్రాడు, ఆంధ్రా అబ్బాయి నితీశ్ కుమార్ రెడ్డి, మహామహులైన బ్యాటర్స్ విఫలమైన చోట గట్టిగా నిలబడి ఐపిఎల్లో తన తొలి అర్థ శతకం కళ్లు చెదిరే రీతీలో సాధించాడు. కేవలం తన నాలుగో ఐపిఎల్ మ్యాచ్లోనే జట్టు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని అసాధారణరీతిలో నిలబెట్టాడు.
విశాఖపట్టణానికి చెందిన ఈ యువ ఆల్రౌండర్ 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి టీమ్ ఇండియాకు తన రాక గురించి ఘనంగా తెలియజేసాడు. ముఖ్యంగా అరివీర భయంకరంగా బంతులు వేసే కసిగో రబడ బౌలింగ్లో నితీశ్ కొట్టిన హుక్షాట్కు స్టేడియమంతా షాక్లో ఉండిపోయింది. పంజాబ్ బౌలర్ల ధాటికి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, క్లాసెన్, రాహుల్ త్రిపాఠి ఔటయి, హైదరాబాద్ 64 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన వేళ, క్రీజ్లో అడుగుపెట్టిన నితీశ్ ఆదిలో ఆచితూచి ఆడాడు. ఆ తర్వాత పెను విధ్వంసం సృష్టించాడు.
రబడ, హర్ప్రీత్బ్రార్, సామ్ కరన్ల బౌలింగ్ను ఊచకోత కోసాడు. ముఖ్యంగా హర్ప్రీత్ ఓవర్లో రెండు సిక్స్లు, రెండు ఫోర్లతో 21 పరుగులు పిండుకున్నాడు. అర్థసెంచరీని కూడా సిక్స్తో అందుకున్న నితీశ్ 17వ ఓవర్లో అర్షదీప్సింగ్ చేతికి చిక్కాడు. అప్పటికి అతను 37 బంతుల్లో 64 పరుగులు చేసాడు. తను క్రీజ్లో వచ్చేటప్పటికి సన్రైజర్స్ అసలు 150 అయినా చేస్తుందా లేదా? అనే సందేహం నుండి 182 పరుగులు చేసి గట్టి లక్ష్యాన్ని విధించగలిగిందంటే అది నితీశ్కుమార్ చలవే.
నితీశ్కుమార్ తండ్రి ముత్యాల రెడ్డి హిందుస్తాన్ జింక్ లిమిటెడ్లో ఉద్యోగి. అయిదేళ్ల వయసులోనే బ్యాట్ పట్టుకున్న నితీశ్, హిందుస్తాన్ జింక్ మైదానంలో ఆడుతున్న సీనియర్ల ఆట చూడటానికి రోజూ వెళ్లేవాడు. అది గమనించిన తండ్రి ముత్యాలరెడ్డి నితీశ్ను ప్రోత్సహించాడు. ఉదయ్పూర్కు బదిలీపై వెళ్లాల్సివచ్చిప్పుడు, అక్కడి క్రికెట్ రాజకీయాలకు భయపడి ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా కొడుకు క్రికెట్ కెరీర్కే అంకితమయ్యాడు. అండర్–12, 14కు ఆడుతున్నప్పుడు మాజీ క్రికెటర్, సెలెక్టర్ ఎమెస్కే ప్రసాద్ దృష్టిలో పడ్డ నితీశ్ ఆంధ్రా క్రికెట్ ఆకాడమీకి ఎంపికయ్యాడు. అండర్–16కు ఆడుతున్నప్పుడు నాగాలాండ్తో మ్యాచ్లో 345 బంతుల్లోనే 441 పరుగులు చేసి సంచలనం సృష్టించిన నితీశ్, మీడియం పేసర్గా ఆ టోర్నమెంట్లో 26 వికెట్లు కూడా తీసుకున్నాడు. ఐపిఎల్ 2024 సీజన్కు 20 లక్షల కనీస ధరకు అమ్ముడుపోయిన నితీశ్కుమార్ రెడ్డి రాబోయే రోజుల్లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడతాడనడంటో ఎలాంటి సందేహం లేదు.