" /> " /> " /> " />

హరికథా పితామహుడు శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు జయంతి – vidhaatha

హరికథా పితామహుడు శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు జయంతి

విధాత‌: ఆదిభట్ల నారాయణ దాసు హరికథా కళాకారుడు, సంగీతం, సాహిత్యం, నృత్యాల మేళవింపుతో హరికథ ప్రక్రియని సృజించి "హరికథా పితామహ" అనే బిరుదంతో ప్రఖ్యాతిగాంచారు. సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు. తెలుగునాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా హరికథా ప్రదర్శనలిచ్చి, ప్రజల మన్ననలను పొందిన కళాకారుడాయన. "శ్రీమత్", "అజ్జాడ" పదాలు కలిపి "శ్రీమదజ్జాడ నారాయణ దాసు" గురువునకు వందనములు చెప్పడం హరికథారంభంలో ఇప్పటికీ కళాకారులు పాటిస్తున్న సంప్రదాయం. 1864 ఆగష్టు […]

  • Publish Date - August 31, 2021 / 03:52 AM IST

విధాత‌: ఆదిభట్ల నారాయణ దాసు హరికథా కళాకారుడు, సంగీతం, సాహిత్యం, నృత్యాల మేళవింపుతో హరికథ ప్రక్రియని సృజించి “హరికథా పితామహ” అనే బిరుదంతో ప్రఖ్యాతిగాంచారు. సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు. తెలుగునాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా హరికథా ప్రదర్శనలిచ్చి, ప్రజల మన్ననలను పొందిన కళాకారుడాయన. “శ్రీమత్”, “అజ్జాడ” పదాలు కలిపి “శ్రీమదజ్జాడ నారాయణ దాసు” గురువునకు వందనములు చెప్పడం హరికథారంభంలో ఇప్పటికీ కళాకారులు పాటిస్తున్న సంప్రదాయం.

1864 ఆగష్టు 31 న ఇప్పటి విజయనగరం జిల్లా, బొబ్బిలి వద్ద, ప్రస్తుతం బలిజిపేట మండలంలో ఉన్న అజ్జాడ గ్రామంలో లక్ష్మీ నరసమాంబ, వేంకటచయనులు దంపతులకు జన్మించాడు. ఆయన అసలు పేరు సూర్యనారాయణ. హరికథకుడిగా ప్రసిద్ధి చెందాక, ఆయన నారాయణదాసుగా ప్రఖ్యాతిగాంచాడు. పేదరికం కారణంగా చిన్నతనంలో బడికి వెళ్ళలేకపోయినా, పద్యాలు, శ్లోకాలు విని, కంఠతా పట్టి తిరిగి వల్లించేవాడు.

కేవలం ఐదేళ్ళ చిరు ప్రాయంలోనే, భాగవతం లోని పద్యాలు ఎన్నో చెప్పేవాడట. ఒకసారి వారి అమ్మగారు పిల్లవాడిని ఏదో పుణ్యక్షేత్రానికి తీసుకువెళ్ళిందట. అక్కడ పుస్తకాల కొట్టులో, భాగవతం చూసి (బాల దాసు)అది కావాలి అని మారాం చేస్తుంటే, ఆ కొట్టు యజమాని, భాగవతం నీకేమి అర్థమవుతుంది అన్నాడట. అంతే ఆ కుర్రవాడు ఆపకుండా భాగవతం లోని పద్యాలు గడగడా చెప్పేశాడట. అది చూసి, ఆ కొట్టు యజమాని ఆనందంగా పిల్లవానికి ఆ పుస్తకంతో పాటు, కొంత దక్షిణ కూడా ఇచ్చి పంపించాడుట.

ఇది ఇలా ఉండగా, ఒకసారి దాసు వాళ్ళ తాతగారింటికి వెళ్ళడం జరిగింది. అక్కడ అరుగు మీద కూర్చుని రాగయుక్తంగా పద్యాలు పాడుతూ ఉంటే, అది చూసి వాళ్ళ తాతగారు ముచ్చటపడి, తన దగ్గరే ఉంచుకుని సంగీతం నేర్పుతానని వాళ్ళ అమ్మగారికి చెప్పాడట. దాంతో అప్పటిదాకా, ఎటో సాగుతున్న నావకి చుక్కాని దొరికినట్లైంది. ఒకప్రక్క సంగీత సాధన, ఇంకో ప్రక్క విద్యాభ్యాసం. ఇలా రెంటినీ అతను ఎంతో నేర్పుగా సంబాళించగలిగాడు చిన్నవయసులోనే.తన 14 వ ఏట ఒకటవ తరగతిలో చేరాడు.

పాండిత్య ప్రకర్ష హరికథా వైభవం

అయితే ఈయనకే ప్రత్యేకమైన హరికథని వెలుగులోకి తెచ్చింది మాత్రం జయంతి రామదాసు. అతని ప్రోద్బలంతో, మొదటి హరికథా కాలక్షేపానికి రంగం సిధ్ధమైంది.మొదటిది రాజమండ్రిలో ఏర్పాటు చేశారు. ఇప్పటిలా కరెంటు లేదు. మైకులు, సౌండ్ బాక్స్ లు లేవు. ఉన్నదల్లా, ఇసుక వేస్తే రాలనంత జనం, మధ్యలో వేదిక మీద నారాయణ దాసు. అంతే ఉన్నట్లుంది మ్రోగింది కంచు కంఠం . ఊరంతా ఉలిక్కిపడింది. గంభీరమైన ఆకారం, ఒక చేతిలో చిడతలు, కాళ్ళకి గజ్జెలు. అలా మొదటి హరికథకి అంకురార్పణ జరిగింది.

ఇక ఆ తరువాత నారాయణ దాసు వెనక్కి తిరిగి చూసుకోలేదు. అతని ఖ్యాతి వాడవాడలా వ్యాపించింది.. మైసూర్ మహారాజు గారి నుండి ఆహ్వానం అందింది. మైసూర్ రాజా హరికథకి ముగ్ధుడైపోయాడు. దీనితో పాటు, వీణాగానం కూడా అడిగి మరీ విన్నాడు. పెద్దయెత్తున బహుమతులు సమర్పించాడు.

కవిత్వం, సంగీతం, నాట్యం అనే మూడు రంగాలలోనూ తనకున్న ప్రతిభను జోడించి నారాయణదాసు హరికథ అనే కళను అత్యున్నత శిఖరాలకు కొనిపోయాడు. ఈ మూడింటి కలయికకూ భక్తి అనే భావం ప్రాణంగా హరికథలు రచించాడు, చెప్పాడు, నేర్పాడు. ఆయన హరికథ వినడం ఒక గొప్ప అనుభూతిగా అప్పటివారు చెప్పుకొనేవారు. మొత్తం ఆయన తెలుగులో 17, సంస్కృతంలో 3, అచ్చతెలుగులో ఒకటి హరికథలను రచించాడు. కొన్నిమార్లు ఒక్కొక్క వర్ణన నాలుగైదు పేజీల నిడివి వరకూ సాగేవి.
ఒకమారు నారాయణదాసు కలకత్తాలో శ్రీకృష్ణజన్మ హరికథను సంస్కృతంలో గానం చేసి హిందీలో భావాన్ని వివరించాడు.

అధ్యాపకునిగా
1919లో అప్పటి విజయనగరం మహారాజు స్థాపించిన శ్రీ విజయరామ గాన పాఠశాలకు మొదటి ప్రధానాధ్యాపకునిగా నారాయణదాసును నియమించారు. ప్రసిద్ధ వయొలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు ఈయనకు సహాధ్యాపకునిగా ఉన్నాడు. ఎందరో ప్రముఖ కళాకారులు ఈ విద్యాసంస్థనుండి ఆంధ్రదేశానికి లభించారు. వారిలో ఘంటసాల వెంకటేశ్వరరావు ఒకడు. నారాయణదాసు ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలో చదువుకొన్నామని చెప్పుకోవడం అప్పట్లో ప్రతిష్ఠాత్మకంగా భావించేవారు.

నారాయణదాసు హిందూస్థానీ భైరవి రాగాలాపనను గురుదేవులు,విశ్వకవి రవీంద్రనాథ టాగూరు ఎంతగానో ప్రశంసించాడు. ఈ విజయనగరం కళాశాల పాఠ్యాంశాలు శాంతినికేతన్లో ప్రవేశపెట్టబడ్డాయి.

ఈయన సకల కళా నైపుణ్యానికి ముచ్చటపడిన బ్రిటీష్ వారు ఆయనను నోబుల్ పురస్కారానికి నామినేట్ చేద్దామనుకున్నారట. కానీ నారాయణదాసు ఒప్పుకోలేదట. తన జీవితం మొత్తం, తాను జన్మించిన తెలుగు గడ్డకి తన వంతు సేవ చేసి, 1945, జనవరి 2వ తేదీన మరణించాడు.