Bullet Rail Project | రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ మెట్రోను విస్తరిస్తున్నారు. ఇక వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలకు ఎయిర్పోర్టులను తీసుకువస్తున్నారు. రాష్ట్రంలోని రహదారులను కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇక కేంద్రం కూడా హైదరాబాద్ నగరాన్ని అనుసంధానిస్తూ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెడుతున్నట్లు ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శాసనసభా వేదికగా కీలక ప్రకటన చేశారు. బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టు కోసం భారత్ ఫ్యూచర్సిటీ పరిధిలో శంషాబాద్ సమీపంలో 500 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనుందని ఆయన తెలిపారు. రానున్న మూడేళ్లలో రాష్ట్రంలో రూ.70 వేల కోట్ల విలువైన రోడ్ల పనులను పూర్తి చేస్తాం. 2028 డిసెంబరు నాటికి తెలంగాణలోని రహదారులను అన్నింటినీ ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ఫ్యూచర్సిటీ-అమరావతి-బందర్పోర్టు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం, హైదరాబాద్-విజయవాడ రహదారి ఆరు లేన్లకు విస్తరణ, మన్ననూరు-శ్రీశైలం మార్గంలో 53 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్ వంటి ప్రాజెక్టులు రాష్ట్రాభివృద్ధికి దారులుకానున్నాయి అని వివరించారు.
కేంద్ర బడ్జెట్ 2026-27లో భాగంగా హైదరాబాద్ను అనుసంధానిస్తూ పలు హై-స్పీడ్ రైలు కారిడార్లను కేంద్రం ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశవ్యాప్తంగా మొత్తం ఏడు హై-స్పీడ్ రైలు కారిడార్లు ప్రతిపాదించగా, వాటిలో మూడు కారిడార్లు హైదరాబాద్ నుంచి ఉండటం విశేషం.
ప్రతిపాదిత హై-స్పీడ్ రైలు కారిడార్లు ఇవే..
ముంబై – పూణే
పూణే – హైదరాబాద్
హైదరాబాద్ – బెంగళూరు
హైదరాబాద్ – చెన్నై
చెన్నై – బెంగళూరు
బెంగళూరు – వారణాసి
వారణాసి – సిలిగురి
