Suicide | వారిద్దరూ ఒకే చోట పని చేస్తున్నారు. ఒకరికొకరు ఇష్టపడ్డారు.. ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇక పెళ్లి చేసుకుందామని చెప్పి.. కొత్త బట్టలు కూడా కొనుక్కున్నారు. ఆ తర్వాత ఓయో రూమ్కి వెళ్లి.. పెళ్లి బట్టల్లోనే ఉరేసుకున్నాడు. ఈ విషాద ఘటన కేపీహెచ్బీ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని అనంతపురం జిల్లా పొట్లూరు మండలం చెర్లోపల్లికి చెందిన వనమల లోకేశ్(29) గండిమైసమ్మ ప్రాంతంలోని ఓ ఫార్మా కంపెనీలో పని చేస్తున్నాడు. అదే కంపెనీలో పని చేస్తున్న యువతిని గత రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో శుక్రవారం ఇద్దరూ కలిసి పెళ్లి బట్టలు కొనుగోలు చేశారు. అనంతరం అడ్డగుట్టలో ఓయో హోటల్కి వెళ్లి అక్కడ ఓ గదిని అద్దెకు తీసుకున్నారు.
ఇక పెళ్లి బట్టలు ధరించిన యువకుడు.. శనివారం గుడిలో లేదా ఆర్యసమాజ్లో పెళ్లి చేసుకుందామని మాట్లాడుకున్నారు. ఆకలిగా ఉంది.. బయటకు వెళ్లి భోజనం తీసుకురా అని ప్రియురాలికి చెప్పాడు. తాను పెళ్లి బట్టలు ధరించానని బయటకు వెళ్లలేని నువ్వే వెళ్లి లంచ్ తీసుకురావాలని ఆమెను పురమాయించాడు.
భోజనం తీసుకొని వచ్చి డోర్ కొట్టగా ఎంతకీ తీయలేదు. దీంతో ఆమె లోకేశ్ స్నేహితులను అప్రమత్తం చేసింది. వారు ఓయో హోటల్కు చేరుకుని, సిబ్బందితో కలిసి డోర్ పగులగొట్టగా.. ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించారు. హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
