దేశంలో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలు ప్రధాని మోదీకి, రాహుల్గాంధీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని, ఓట్ ఫర్ జిహాద్..ఓట్ ఫర్ వికాస్(అభివృద్ధి) మధ్యన, కొన్ని కుటుంబ పార్టీల అభివృద్ధికి...యావత్ దేశాభివృద్ధికి మధ్యన జరుగుతున్న ఎన్నికలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభివర్ణించారు
ఓట్ ఫర్ జిహాద్ వర్సెస్ ఓట్ ఫర్ వికాస్ మధ్య ఫైట్
భువనగిరి బీజేపీ ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా
మైనార్టీ బుజ్జగింపు రాజకీయాల్లో ఏబీసీలుగా ఎంఐఎం, బీఆరెస్, కాంగ్రెస్లు
తెలంగాణలో బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లపై ధీమా
విధాత: దేశంలో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలు ప్రధాని మోదీకి, రాహుల్గాంధీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని, ఓట్ ఫర్ జిహాద్..ఓట్ ఫర్ వికాస్(అభివృద్ధి) మధ్యన, కొన్ని కుటుంబ పార్టీల అభివృద్ధికి…యావత్ దేశాభివృద్ధికి మధ్యన జరుగుతున్న ఎన్నికలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభివర్ణించారు. గురువారం బీజేపీ భువనగిరి పార్లమెంటు అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా ప్రసంగించారు.
దేశమంతా మోదీ గాలి వీస్తుందని, ఇప్పటికే జరిగిన మూడు దశల ఎన్నికల్లో బీజేపీ 200సీట్లకు పైగా గెలవబోతుందని, తెలంగాణలో జరిగే నాల్గవ విడత ఎన్నికల్లో బీజేపీ డబుల్ డిజిట్ 10పార్లమెంటు స్థానాలు గెలిచి 400సీట్ల సాధనలో పురోగమిస్తామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ సీఎం రేవంత్రెడ్డి వినాలని 2019లో బీజేపీ 4ఎంపీ సీట్లలో గెలిచిందని, ఈ దఫా పది సీట్లు గెలవబోతున్నామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు దేశంలో పోటీ చేసేందుకు అభ్యర్థులు సైతం దొరకడం లేదని, ఆ పార్టీ రాహుల్గాంధీ మిత్రుడు, ఫోర్జరీ కేసులో సస్పెండైన వ్యక్తిని భువనగిరిలో అభ్యర్థిగా పెట్టారని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు పేరుతో పదేళ్లు పాలించిన బీఆరెస్ పార్టీ తమ టుంబాన్ని మాత్రమే బాగు చేసుకున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐదేళ్ల పాలనకు అవకాశమిస్తే ఆ పార్టీ తెలంగాణను ఏటీఎంలో వాడుకుంటున్నదని ఆరోపించారు. మూడోసారి మోదీ ప్రధానిగా చేసేందుకు మద్దతుగా భువనగిరిలో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్కు ఓటు వేయాలని కోరారు. తెలంగాణలో 10సీట్లు గెలిపిస్తే దేశంలో రాష్ట్రాన్ని నంబరవన్గా మారుస్తామన్నారు.
అబద్ధాలతో గెలవాలని చూస్తున్న కాంగ్రెస్
కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి పార్లమెంటు ఎన్నికల్లో గెలవాలని చూస్తుందని, మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని, రాజ్యాంగాన్ని మారుస్తామని అబద్ధాలు చెబుతున్నారని, మోదీ పదేళ్ల పాలనలో పూర్తి మెజార్టీతో పాలించినా రిజర్వేషన్లను కొనసాగించారని గుర్తు చేశారు. తెలంగాణలో ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు కన్నం వేయాలని చూస్తుందని దీనినీ తాము అడ్డుకుంటామన్నారు. బీజేపీని తెలంగాణలో 10ఎంపీ సీట్లలో గెలిపిస్తే ముస్లిం రిజర్వేషన్లను తొలగించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు పంచుతామన్నారు. ప్రధాని మోదీ చెప్పే మాట గ్యారంటీ అయితే..కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పే మాటలు చెల్లని కాగితాల వంటివని, సూర్యాస్తమయానికి రాహుల్ హామీలు ఆరిపోతాయని అమిత్ షా విమర్శించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇస్తామని చెప్పాడని, ఇప్పటివరకు చేయలేదని, 15000 రైతుభరోసా ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, ఏడాదికి 12,000 రైతు కూలీలకు ఇస్తామని ఇవ్వలేదని, వరికి 500 బోనస్ ఇస్తామని, బాలికలకు స్కూటీలుఇస్తామని ఇవ్వలేదన్నారు. ప్రధాని మోదీ రామమందిర్ నిర్మిస్తామని, 370అర్టికల్ రద్దు చేస్తామని, త్రిఫుల్ తలాక్ రద్దు చేస్తామని చెప్పి చేశాడని గుర్తు చేశారు. దేశంలో ఉగ్రవాదం..తీవ్రవాదాన్ని నిర్మూలించాడన్నారు. ఏఐసీసీ నేత మల్లిఖార్జున్ ఖర్గే రాజస్థాన్, తెలంగాణకు చెందిన ప్రజలకు కశ్మీర్ తో సంబంధం ఏమంటున్నారని, కాశ్మీర్ కోసం భువనగిరిలోని ప్రతి పిల్లవాడు ప్రాణాలు ఇస్తాడని గుర్తు చేశారు.
ఏబీసీలుగా ఆ మూడు పార్టీలు
తెలంగాణలో ఏబీసీ పార్టీలుగా ఎంఐఎం(అసదుద్దిన్), బీఆరెస్, కాంగ్రెస్లు పనిచేస్తున్నాయని, వాటి మధ్య ముస్లిం బుజ్జగింపు రాజకీయాల ముక్కోణపు ప్రేమాయణం కొనసాగుతుందని అమిత్ షా విమర్శించారు. ఏబీసీ పార్టీ పాలకులు శ్రీరామనవమి ఊరేగింపు పై కూడా ఆంక్షలు విధిస్తారని, తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించరని, సీఏఏను వ్యతిరేకిస్తారని, ఖురాన్ ఆధారంగా తెలంగాణను నడపాలని చూస్తున్నారని ఆరోపించారు.
ఎంఐఎం అరాచకాలను కాంగ్రెస్, బీఆరెస్లు అడ్డుకోలేవన్నారు. ప్రధాని మోదీరద్దు చేసిన త్రిపుల్ తలాఖ్ను ఏబీసీ పార్టీలు మళ్ళీ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాయని, వారు రామ మందిరం ప్రాణ ప్రతిష్టను బహిష్కరించారని విమర్శించారు. ప్రధాని మోదీ ప్రభుత్వం భువనగిరి ప్రాంతం అభివృద్ధి కోసం 14వేల కోట్లతో జాతీయ టెక్స్టైల్ విధానంలో భాగంగా పోచంపల్లిలో 1500కోట్లతో చేనేత పార్క్ను ఏర్పాటు చేసిందన్నారు. 8 లక్షల మంది చేనేత కార్మికులకు మోదీ ఉపాధి కల్పించారని గుర్తు చేశారు.
భువనగిరి నుంచి భూపాలపట్నం వరకు 148 కోట్లతో జాతీయ రహదారి నిర్మాణం చేశారని, బీబీనగర్ ఎయిమ్స్ కోసం నిర్మించారని, జనగామ నుంచి భువనగిరి రైల్వే వరకు ఆధునికరణ పనులు చేపట్టారని, కొమరవెల్లి రైల్వే స్టేషన్ ఆధునికరణ పనులు జరుగుతున్నాయిని, రాయగిరి నుంచి వరంగల్ వరకు నాలుగో లైన్ల రహదారి పూర్తి చేశామని తెలిపారు.
సూర్యాపేట నుంచి సిద్దిపేట వరకు జాతీయ రహదారి నిర్మాణం జరుగుతుందని, 2లక్షల 31 వేల మంది ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నారని, ఏటా కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రతి రైతుకు 6వేలు అందిస్తున్నారని గుర్తు చేశారు. ప్రధాని మోదీ మూడోసారి అధికారంలో వస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని, అందుకోసం బీజేపీని గెలిపించాలని అమిత్ షా కోరారు.