ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుండెలో బండి సంజయ్ కుమార్కు ప్రత్యేక స్థానం ఉందని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై అన్నారు.
ఆయన స్పూర్తితోనే తమిళనాడులో పాదయాత్ర
తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై
విధాత బ్యూరో, కరీంనగర్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుండెలో బండి సంజయ్ కుమార్కు ప్రత్యేక స్థానం ఉందని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై అన్నారు. దక్షిణ భారత దేశంలో బీజేపీని బలోపేతం చేసేందుకు బండి సంజయ్ కు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారని చెప్పారు. బండి సంజయ్ చేసిన పోరాటాలు దేశానికే ఆదర్శమయ్యాయన్నారు. సంజయ్ పాదయాత్ర స్పూర్తితోనే తమిళనాడులో తాను పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేసి లాఠీలు, కేసులకు భయపడకుండా జైలుకు వెళ్లిన చరిత్ర సంజయ్ కే సొంతమన్నారు.
బండి సంజయ్ గెలిస్తే సామాన్యుడు గెలిచినట్లేనన్నారు. మొత్తం పోలైన ఓట్లలో 60 శాతం ఓట్లు బండి సంజయ్ కే పడేలా ఇంటింటికీ తిరిగి గెలిపించాలని యువతకు పిలుపునిచ్చారు. జమ్మికుంటలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సమ్మేళనానికి బండి సంజయ్ తోపాటు తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, ప్రతాపరామక్రిష్ణ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అన్నామలై మాట్లాడుతూ బండి సంజయ్ యూత్ ఐకాన్… అందుకే బండి సంజయ్ అందుకే ఆయనకు చారిత్రాత్మక విజయాన్ని కరీంనగర్ ప్రజలు అందించబోతున్నారనే నమ్మకం తనకు ఉందన్నారు. కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులు కూడా తీసుకువచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. దేశంలో రైతులు, యువత, మహిళలు, విద్యార్థుల వ్యతిరేకి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ మాత్రమే అన్నారు. మోదీ కోసం పార్టీ కార్యకర్తలు 5 రోజులు కష్టపడండి… మోదీ మీకోసం 5 ఏళ్లు కష్టపడి సేవ చేస్తారని తెలిపారు.
బండి సంజయ్ మాట్లాడుతూ తాము పువ్వు గుర్తుపై ఓటేయాలని తిరుగుతుంటే… సీఎం రేవంత్ రెడ్డి మాత్రం గాడిద గుడ్డు గుర్తు పట్టుకుని తిరుగుతున్నరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కు ఓటేయాలనుకునే వాళ్లు బ్యాలెట్ లో గాడిద గుడ్డు గుర్తు ఉంటేనే ఓటేయ్యాలన్నారు. మోదీపై విషం చిమ్ముతున్న కాంగ్రెస్ నాయకులను చూసి జనం నవ్వుకుంటున్నరని, వారు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడం లేదు. కరీంనగర్ లో ఆ పార్టీ 3వ స్థానానికే పరిమితం అవుతుందని తెలిపారు.