తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
విధాత, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు విచారణ జరుగుతున్న పోలీస్ స్టేషన్ పరిధి మారింది. ఈ కేసు విచారణనను బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషను మార్చారు. అయితే స్టేషన్ ఎందుకు మార్చారన్నదానిపై అధికారులు స్పష్టతనివ్వలేదు. ఈ కేసులో నిందితుడు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు విచారణను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నిర్వహించారు.
మరోవైపు ఎన్నికల నేపథ్యంలో కొంత నెమ్మదించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో వేగం పెంచేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు. ఇప్పటికే నిందితుల నుంచి దర్యాప్తు అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. సేకరించిన ఆధారాల నేపథ్యంలో త్వరలోనే మరిన్ని అరెస్టులు కూడా చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కొంత మంది పోలీసు అధికారులతో పాటు ఇతర వ్యక్తులను కూడా అరెస్ట్ చేయనున్నారని తెలుస్తుంది.
స్పెషల్ ఇంటెలిజెన్స్ లాకర్ రూమ్ ధ్వంసం చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు భారత్ రానున్నారు. జూన్ 26న ఇండియాకు రావాల్సి ఉండగా.. ఓ వైపు రెడ్ కార్నర్ నోటీసులు, మరోవైపు కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసుల విచారణకు సహకరించేందుకు ముందుగానే ఇండియాకు రానున్నారని పోలీసు వర్గాల కథనం.
ప్రభాకర్రావుతో పాటు ఆరవ నిందితుడిగా ఉన్న ఓ ఛానెల్ ఎండీ శ్రవణ్ కుమార్ విచారణ కూడా కీలకం కానుంది. దీంతో వారిని భారత్కు తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. వీరిపై ఇప్పటికే నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి ఇమ్మిగ్రేషన్, ఇంటర్పోల్కు సమాచారం అందించారు.