అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడో పూర్తయినా ప్రభుత్వం ఇంతవరకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వకపోవడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు
విధాత హైదరాబాద్ : అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడో పూర్తయినా ప్రభుత్వం ఇంతవరకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వకపోవడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. గాంధీ భవన్ వద్ద మోకాళ్లపై కూర్చుని నిరసన తెలుపుతున్న ఏఈఈ అభ్యర్థులకు ఎక్స్ వేదికగా సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆరెస్ ప్రభుత్వం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి వివిధ దశల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేసిందన్నారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చిలో అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసినా ఇప్పటికీ ప్రభుత్వం నియామక పత్రాలు ఇవ్వడం లేదని విమర్శించారు. అభ్యర్థులు మంత్రులకు, అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఏఈఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్ చేశారు.