ఉమ్మడి పాలమూరు జిల్లా లో గులాబీ పార్టీ పరిస్థితి రోజు రోజు కు అద్వానంగా మారుతోంది. రోజుకో చోట ఆ పార్టీ నేతలు పార్టీ ని వీడుతున్నారు.
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ఉమ్మడి పాలమూరు జిల్లా లో గులాబీ పార్టీ పరిస్థితి రోజు రోజు కు అద్వానంగా మారుతోంది. రోజుకో చోట ఆ పార్టీ నేతలు పార్టీ ని వీడుతున్నారు. వీరిని నిలువరించే నేతలు మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ బీ ఆరెస్ నాయకులు ఆ పార్టీ ని వదిలి కాంగ్రెస్ వైపు వెళుతున్నారు. ఒకప్పుడు బీ ఆరెస్ లో చోటు దొరకడం కోసం నేతలు నానా పాట్లు పడేవారు.ఎమ్మెల్యే లు, మంత్రుల ఇంటి వద్ద పడిగాపులు కాసినా ఫలితం ఉండేది కాదు. పదవి కావాలంటే చేతిచమురు వదిలించుకునే పరిస్థితి ఉండేది.
కానీ ప్రస్తుతం అందుకు భిన్నంగా మారింది. టికెట్ ఇస్తామని బతిమాలినా ముందుకు వచ్చే నాయకులే కరువయ్యారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దెబ్బ కు కకావికాలమైన బీ ఆరెస్ ప్రస్తుతం మనుగడ కోల్పోతోంది. 2018 లో ఉమ్మడి జిల్లా లో 14 అసెంబ్లీ స్థానాల్లో అన్నింటిలో విజయం పొంది జిల్లా లో ఎదురు లేని పార్టీ గా నిలిచింది. 2023 లో బీ ఆరెస్ పార్టీ రెండు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. పదేళ్ల పాలనలో జిల్లా లో బీ ఆరెస్ ఎమ్మెల్యే పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం తో రెండు స్థానాలకే ప్రజలు పరిమితం చేశారు. రాష్ట్రం లో బీ ఆరెస్ అధికారం కోల్పోయిన వెంటనే ఆ పార్టీ నాయకులు ఇతర పార్టీ ల వైపు చూస్తున్నారు.
ప్రస్తుతం పాలమూరు లో ఎమ్మెల్సీ ఎన్నిక ఉండడం తో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేస్తోంది. గతంలో ఈ స్థానం లో బీ ఆరెస్ అభ్యర్థి భారీ మెజారిటీ తో గెలుపొందారు. ప్రస్తుతం కూడా ఎంపీటీసీ లు, కౌన్సిలర్లు, ఎంపీపీ లు, జడ్పీ చైర్మన్ లు బీ ఆర్రెస్ మద్దతుదారులే అధికంగా ఉన్నారు. కానీ వారందరు కాంగ్రెస్ లో చేరితేనే ఎమ్మెల్సీ స్థానం దక్కుతుందనే ఉదేశ్యం లో కాంగ్రెస్ పార్టీ అధినేతలు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం తో ఎమ్మెల్సీ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రతిష్టత్మకంగా తీసుకున్నారు. సాధ్యమైనత వరకు బీ ఆరెస్ మద్దతుగా ఉన్న ఎంపీటీసీ లను, కౌన్సిలర్ల ను, జడ్పీటీసీ లను కాంగ్రెస్ వైపు మల్లించేందుకు ఎమ్మెల్యే లు తీవ్ర కృషి చేస్తున్నారు.
ఇప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో కొందరు ఎమ్మెల్యే లు చేస్తున్న ప్రయత్నం సఫలం అవుతున్నాయి. మహబూబ్ నగర్, గద్వాల మున్సిపల్ కౌన్సిలర్లు ఇప్పటికే గంప గుత్తగా కాంగ్రెస్ గూటికి చేరారు. గద్వాల లో బీ ఆరెస్ ఎమ్మెల్యే ఉన్నా అక్కడి చైర్మన్ తో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరంతా మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. గద్వాల లో ఎమ్మెల్యే తప్పా మిగతా ఎవ్వరూ బీ ఆరెస్ లో లేకుండా పోతున్నారు. గద్వాల లో ప్రస్తుత పరిస్థితి చూస్తే గులాబీ పార్టీ ఖేల్ ఖతం అయినట్లే తెలుస్తోంది.
పాలమూరు నియోజకవర్గంలో గులాబీ పార్టీ కి షాక్ :
ఇప్పటికే పాలమూరు మున్సిపాలిటీ లో కాంగ్రెస్ జెండా ఎగురవేసి పట్టు సాధించింది. బీ ఆరెస్ చైర్మన్ ను గద్దె దింపి కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ గా ఆనంద్ గౌడ్ ను ఎన్నుకున్నారు.ఈ మున్సిపాలిటీ లో గులాబీ పార్టీ కి పెద్ద షాక్ తగిలింది. మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న సమయం లో బీ ఆరెస్ జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణమ్మ కాంగ్రెస్ పార్టీ లో చేరడం తో ఆ పార్టీ కి భారీ ఎత్తున నష్టం జరిగింది. ఈ స్థానం లో గులాబీ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ గా ఎన్నిక సులువుగా ఉంటుందని భావించిన ఆ పార్టీ నేతలు ప్రస్తుతం ఓటమి అంచుకు వెళుతున్నామనే భావన లో ఉన్నారు.
కొడంగల్, మక్తల్, దేవరకద్ర, జడ్చర్ల, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల్లో ని ఎంపీటీసీ లు, జడ్పీటీసీ లు, ఎంపీపీ లు చాలా వరకు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది. ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డి గెలుపు ఖాయమనే పరిస్థితి కనపడుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికకు ఇంకా ఏడు రోజుల సమయం ఉండడం తో కాంగ్రెస్ పార్టీ కి మరింత మద్దతు పెరిగే అవకాశం ఉంది. జిల్లా లో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే లు తమ పార్టీ నుంచి ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్న అభ్యర్థి గెలుపు కోసం తీవ్రం గా కృషి చేస్తున్నారు.
అయోమయంలో బీఆర్ఎస్ అభ్యర్థి
అండ గా ఉంటారనుకుంటే అందరూ వెళ్లిపోతున్నారని బీ ఆరెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి ఆందోళన చెందుతున్నారు. పార్టీ నుంచి వెళ్లిపోతున్న వారిని నిలువరించే నాయకుడే లేకపోవడం తో ఆ పార్టీ శ్రేణులు ఆవేదన చెందుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం లో కూడా గులాబీ శ్రేణులు కనిపించడం లేదు. ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి కూడా క్యాడర్ మద్దతుగా నిలువడం లేదు. ఎమ్మెల్సీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న నవీన్ కు పార్టీ పెద్ద ల నుంచి కూడా మద్దతు లభించడం లేదు. జిల్లా నేతలు కూడా ఆయన ప్రచారం లో పాల్గొనడం లేదు. దీంతో గులాబీ శ్రేణులు అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయి. బీ ఆరెస్ పార్టీ ని వీడే వారి సంఖ్య పెరగడం తో ఈ స్థానం లో ఆ పార్టీ కి ఎమ్మెల్సీ దక్కడం అంత సులువుకాదని తెలుస్తోంది.