ఫోన్ ట్యాపింగ్పై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలతోనే సీఎం రేవంత్రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసుపై చర్యలు తీసుకోవడం లేదని అనుమానంగా ఉందన్నారు
కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలతోనే చర్యలకు వెనుకడుగు
పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు
విధాత: ఫోన్ ట్యాపింగ్పై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలతోనే సీఎం రేవంత్రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసుపై చర్యలు తీసుకోవడం లేదని అనుమానంగా ఉందన్నారు. ట్యాపింగ్పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు గతంలోని కేసీఆర్ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని లక్ష్మణ్ ప్రశ్నించారు. కేసీఆర్ తన కూతురు కవితను లిక్కర్ స్కామ్ కేసు నుంచి తప్పించేందుకే ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు.
ఢిల్లీ పెద్దలను ఇరికించి తన కూతురుని లిక్కర్ స్కామ్ కేసు నుంచి బయట పడేయాలని కేసీఆర్ చూశారన్నారు. తప్పు చేసిన వారిని జైలుకు పంపిస్తామని రేవంత్ చెప్పారని.. ఇన్ని సంచలన విషయాలు బయటకు వస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్పై దర్యాప్తు, విచారణ అన్నారని.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పత్రాల లీక్పై చర్యలు అన్నారని.. డ్రగ్స్పై చర్యలన్నారని,..ఇప్పుడు ఏవీ పట్టించుకోవడం లేదని రేవంత్ సర్కార్ తీరును లక్ష్మణ్ తూర్పారబట్టారు.
విచారణ ఎదుర్కోంటున్న పోలీసు అదికారులు కేసీఆర్ ప్రమేయంతోనే ట్యాపింగ్ జరిగిందని చెప్పారని.. వాంగ్మూలంలో స్పష్టంగా పేర్కొన్నారని లక్ష్మణ్ గుర్తు చేశారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఒక మాఫియాను నడిపించారని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనాల కోసం నాయకులు, ఇతర వ్యక్తుల ఫోన్లను ట్యాపింగ్ చేశారని లక్ష్మణ్ విమర్శించారు. చివరికి జడ్జిల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు అరెస్ట్ అయిన అధికారులు చెబుతున్నారని అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితుడిగా ఉన్న సీఎం రేవంత్.. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని లక్ష్మణ్ ప్రశ్నించారు. ఢిల్లీ ఒత్తిళ్లకు లొంగిపోయారా? అని ప్రశ్నించారు. బీఆరెస్ అక్రమ సంపాదన డబ్బులను తరలించేందుకు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారంటూ లక్ష్మణ్ విమర్శించారు. కేసీఆర్, ఆయన అల్లుడు హరీష్ రావుల పేర్లను పోలీసు అధికారులు తమ వాంగ్మూలంలో చెప్పారని లక్ష్మణ్ ఉటంకించారు.
వామపక్ష తీవ్రవాదానికి సంబంధించిన డేటాను కూడా ధ్వంసం చేశారన్నారు. దేశ భద్రతకు విఘాతం కలిగించేలా చేశారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ అరాచకాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయని.. ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ వస్తుందని లక్ష్మణ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణ రాష్ట్రంలో అనేక రాజకీయ మార్పులు రాబోతున్నాయన్నారు. బీఆరెస్ కాంగ్రెస్లో విలీనం కాబోతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగాలని ఒక ప్రజాస్వామిక వాదిగా కోరుకుటున్నానన్నారు.
అందే శ్రీ పాటను స్వాగతిస్తున్నాం..
తెలంగాణ రాష్ట్ర పాటగా అందే శ్రీ పాటను స్వాగతిస్తున్నామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రకటించారు. అందే శ్రీ పాట విషయంలో తమకు ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. ఒక గొప్ప పాటను అందే శ్రీ రాశారని కొనియాడారు.