KCR | ఓమ్నీ వ్యాన్ నడిపిన కేసీఆర్.. సోష‌ల్ మీడియాలో ఫొటో వైర‌ల్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మ‌ళ్లీ త‌న చేతుల్లోకి స్టీరింగ్ తీసుకున్నారు. కేసీఆర్ స్వ‌యంగా ఓమ్నీ వ్యాన్ న‌డిపిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది

  • Publish Date - June 27, 2024 / 03:12 PM IST

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మ‌ళ్లీ త‌న చేతుల్లోకి స్టీరింగ్ తీసుకున్నారు. కేసీఆర్ స్వ‌యంగా ఓమ్నీ వ్యాన్ న‌డిపిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. కాలు ఆపరేషన్ తరువాత కర్ర సహాయం లేకుండా కేసీఆర్ న‌డుస్తున్నారు. మ్యానువల్ కారు నడిపి చూడమని డాక్టర్ల సూచనల మేరకు తన పాత ఓమ్నీ వ్యాన్‌ను కేసీఆర్ న‌డిపారు.

గ‌తేడాది డిసెంబ‌ర్ 8వ తేదీన రాత్రి ఎర్ర‌వెల్లిలోని త‌న ఇంట్లో కేసీఆర్ కాలు జారిప‌డిన సంగ‌తి తెలిసిందే. దీంతో కేసీఆర్‌ను హుటాహుటిన సోమాజిగూడ య‌శోదా ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. కేసీఆర్‌కు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స నిర్వ‌హించారు. శ‌స్త్ర‌చికిత్స అనంత‌రం వైద్యుల సూచనల మేరకు వాకర్‌ సాయంతో కేసీఆర్ న‌డిచారు. డిసెంబ‌ర్ 15వ తేదీన కేసీఆర్ య‌శోదా నుంచి డిశ్చార్జి అయ్యారు.

నాటి నుంచి కొద్ది రోజుల క్రితం వ‌ర‌కు కేసీఆర్ వాక‌ర్ సాయంతోనే న‌డిచారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో నిర్వ‌హించిన రోడ్‌షోల్లోనూ కేసీఆర్ వాక‌ర్‌తోనే క‌న‌బ‌డ్డారు. కొద్ది రోజుల నుంచి వాక‌ర్ సాయం లేకుండానే కేసీఆర్ న‌డుస్తుండ‌డంతో.. మ్యానువ‌ల్ కారు న‌డిపి చూడ‌మ‌ని డాక్ట‌ర్లు సూచించ‌డంతో.. గురువారం త‌న పాత ఓమ్నీ వ్యాన్‌ను న‌డిపారు.

ఇక ఫొటోపై అటు రాజ‌కీయాల్లో, ఇటు సామాజిక మాధ్య‌మాల్లో ఆస‌క్తిక‌ర సంభాష‌ణ‌లు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవ‌డంతో.. కేసీఆర్ మ‌ళ్లీ త‌న చేతుల్లోకి స్టీరింగ్ తీసుకున్నార‌ని వ్యంగ్య‌స్త్రాలు సంధిస్తున్నారు. ఇక కేసీఆర్ బ‌య‌ల్దేరిండు అంటూ ఆ ఫొటోను నెటిజ‌న్లు షేర్ చేస్తున్నారు.

Latest News