విధాత: బీఆర్ఎస్తోనే దేశానికి వెలుగు అని రాష్టం విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. గురువారం కోదాడ నియోజకవర్గం మోతే మండలం మామిళ్ల గూడెంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి, స్థానిక శాసన సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ సమక్షంలో కాంగ్రెస్కు చెందిన మోతె మాజీ ఎంపిపి ఆరే లింగారెడ్డి, గొంపిచంద్రారెడ్డితో పాటు వందలాది మంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరగా, వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో రాజకీయ ప్రలోభాలు లేనీ రాష్టం తెలంగాణ అని అన్నారు.
ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పాలిస్తున్న మోడీనీ ప్రశ్నించడంలో కాంగ్రెస్ విఫలం అయిందన్నారు.
దేశంలో దివాలా తీసిన కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో సైతం చేవ చచ్చిందన్నారు. ప్రధాని మోడీకి కార్యకర్త గా రాహుల్ మారాడన్నారు. ప్రజలకు ఏమి కావాలో తెలుసుకుని తెలంగాణను నంబర్ వన్గా నిలబెట్టిన పాలకుడు కేసీఆర్ అని కొనియాడారు. కొత్త నాయకత్వన్ని దేశ ప్రజలు కోరుతున్నారన్నారు.
8ఏళ్ల పాలనలోనే తెలంగాణను నంబర్ వన్గా మార్చిన కేసీఆర్ పాలన కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ తరహా పథకాలు దేశంలో ఎక్కడా లేవు అని అన్నారు. పథకాల కోసం దేశం నలుమూల నుండి మన ప్రాంతానికి వలస వస్తున్నారని అన్నారు. మన ఆకాంక్షల కు అనుగుణంగా పాలన చేసి మన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చి దేశ ప్రజలకు మంచి చేయడానికి కేసీఆర్ చేసే యజ్ఞంలో మనమంతా భాగస్వామ్యం అవ్వాలని కోరారు.
సందర్బం ఏదైనా బీఆర్ఎస్ కు ప్రజలు అండగా నిలబడాలని మంత్రి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే బొల్లం మాట్లాడుతూ గత పాలకుల హయాంలో అభివృద్ధి అంటే ఏంటో తెలియని కోదాడ ప్రజలకు అభివృద్ధిని పరిచయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన దక్షత కారణంగా కోదాడలో అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు.