ఖమ్మం జిల్లా మంత్రుల నిర్లక్ష్యం కారణంగానే పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకపోయి దాదాపు రూ. 100 కోట్లు నష్టం జరిగిందని, పనికిరాని మంత్రులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనని బీఆరెస్ పార్టీ ట్విటర్ వేదికగా ఆరోపించింది
బీఆరెస్ మండిపాటు
విధాత : ఖమ్మం జిల్లా మంత్రుల నిర్లక్ష్యం కారణంగానే పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకపోయి దాదాపు రూ. 100 కోట్లు నష్టం జరిగిందని, పనికిరాని మంత్రులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనని బీఆరెస్ పార్టీ ట్విటర్ వేదికగా ఆరోపించింది. శాఖల మీద పట్టులేకపోడం, అనుభవారహిత్యంతో జిల్లాను మంత్రులు భ్రష్టు పట్టిస్తున్నారని బీఆరెస్ ఆరోపించింది. మొదటి మంత్రి పేరుకే ఉప ముఖ్యమంత్రి అని ఎవరూ ఆయన్ని పట్టించుకోరని, రెండో మంత్రి ఆయన ముద్దుపేరు గడియారాల మంత్రి అని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఏ వేడుక జరిగినా గడియారాలు పంచడం ఆయన హాబీ అని ఎద్దేవా చేసింది. మూడో మంత్రి ఈయనకు సంబంధించిన శాఖపరమైన మీటింగ్లో కూడా ఈయనకు చోటు ఉండదని, అదే ఆయన స్పెషాలిటీని వ్యంగ్యాస్త్రాలు సంధించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెద్దవాగు ప్రాజెక్ట్ గేట్ల దగ్గర భారీ గండి పడి, ప్రాజెక్టు పూర్తిగా ఖాళీ అవ్వగా, దిగువన గ్రామాలను వరదనీరు ముంచెత్తింది. దీనివల్ల వందల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, భారీ వర్షం కారణంగా రాత్రికి రాత్రే వరద ముంచెత్తి ఇండ్లు కూలిపోగా, వందల సంఖ్యలో పశువుల మృత్యువాత పడ్డాయని, అసమర్థ కాంగ్రెస్ పాలనకు పరాకాష్ట ఇది అని బీఆరెస్ విమర్శించింది. కాగా పెద్దవాగు ఎగువన గుబ్బల మంగమ్మ అటవీ ప్రాంతంలో ఆరుగంటల్లోనే 31.1సెంటిమీటర్ల వర్ష పడటంతో పెద్దవాగులోకి 80క్యూసెక్కుల నీరు చేరింది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టడం 21అడుగులుకాగా, ఔట్ ఫ్లో కంటే ఇన్ ఫ్లో అధికమవ్వడం, ప్రాజెక్టుకు ఉన్న మూడు గేట్లు తెరిచారు.
ప్రాజెక్టు కట్టపై నుంచి వరద ఉదృతి సాగిపోగా, గేట్ల పక్కన పడిన గండి 150మీటర్ల పొడగువు, 15మీటర్ల వెడల్పు పెరిగి రాత్రికి రాత్రే పెద్దవాగు ఖాళీ అయ్యింది. దీంతో తెలంగాణ పరిధిలోని గుమ్మడవెల్లిలో 70ఇండ్లు జలమయామవ్వగా, ప్రజలు ఇళ్లపైకి చేరి ప్రాణాలు కాపాడుకున్నారు. బచ్చువారిగూడెం, నారాయణపూరం గ్రామాల్లో సైతం ఇళ్లు దెబ్బతినడంతో దాదాపు 1000ఎకరాల మేరకు పంట నష్టం, పశునష్టం వాటిల్లింది. ప్రాజెక్టు తెలంగాణలో, ఆయకట్టు ఏపీ పరిధిలో ఉండటంతో రెండు రాష్ట్రాల అధికారులు ప్రాజెక్టును పరిశీలించారు. పెద్దవాగు తెగడంతో దాదాపు 100కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని, తాత్కాలిక మరమ్మతులు చేయాలన్న 1కోటి మేరకు అవసరముందని, ఇరిగేషన్ శాఖకు 20కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేశారు.