Jagadish Reddy | ఓటమి భయంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రలోభాలు: జగదీశ్రెడ్డి
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు

విధాత : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని 457 నెంబర్ పోలింగ్ బూత్లో ఆయన తొలి ఓటు వేశారు. అనంతరం నల్లగొండలో పోలింగ్ సరళిని పరిశీలించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం కాంగ్రెస్ గెలవాలని ప్రయత్నిస్తుందన్నారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, పోలీస్ రాజ్యం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైన గెలవాలని కాంగ్రెస్ అధికార దుర్వినియోగంతో అరాచకాలు సృష్టిస్తోందని ఆరోపించారు. ప్రశ్నించే వారిపై ఈ ప్రభుత్వం దాడులు చేస్తూ భయాందోళనకు గురి చేస్తుందన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికలో కాంగ్రెస్కు బుద్ధి చెప్పేందుకు ఓటర్లు ముందుగానే నిర్ణయించుకున్నారన్నారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని, బీఆరెస్ అభ్యర్థికి మద్దతు భారీగా పెరిగిందన్నారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మాదిరిగా కాకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు.