Jagadish Reddy | హామీల దాటవేతకే కేబినెట్ సబ్ కమిటీలు: మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి 

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక..పరిపాలన చేతగాక కేబినెట్ సబ్ కమిటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలపై దాటవేతకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి విమర్శించారు

Jagadish Reddy | హామీల దాటవేతకే కేబినెట్ సబ్ కమిటీలు: మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి 

ప్రాజెక్టుల్లో నీటి నిల్వకు సబ్ కమిటీ ఓ విడ్డూరం

విధాత, హైదరాబాద్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక..పరిపాలన చేతగాక కేబినెట్ సబ్ కమిటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలపై దాటవేతకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే పలు సబ్ కమిటీలను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రాజెక్టుల్లో నీటి నిల్వకు కూడా సబ్ కమిటీ వేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రేషన్ కార్డుల జారీపై కూడా సబ్ కమిటీ వేయడం అనాలోచిత నిర్ణయమని, తప్పించుకునే దొంగబుద్ధికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రంలో పరిపాలన పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదని, కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు ప్రభుత్వం నడపడంపై అవగాహన, బాధ్యత ఉన్నట్లుగా కనిపించడం లేదని విమర్శించారు.

జల్సాలకే పరిమితమై రాష్ట్ర అభివృద్ధిని మరిచినట్లు కనబడుతుందన్నారు. ప్రాజెక్టుల్లో గ్రౌడింగ్ సర్వసాధారణ ప్రక్రియ అని చెప్పారు. కాంగ్రెస్ నిర్లక్ష్యంతో యాసంగిలో పొలాలు ఎండినట్లు ఇప్పుడు ఖరీఫ్‌లోనూ ఎండిపోయే పరిస్థితి కనపడుతుందన్నారు. ఎన్‌డీఎస్‌ఏకి నివేదికలు పంపి అనుమతులు తీసుకోవాలని.. వర్షాలు ఆగి వరద రాకపోతే తెలంగాణ రైతుల ప్రాణాలు పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కన్నెపల్లి పంప్‌హౌస్ ఎత్తిపోతల ప్రారంభించాలని.. వెంటనే రివ్యూ చేసి ఎత్తిపోతలు మొదలుపెట్టకపోతే రైతులకు ద్రోహం చేసినట్టేనన్నారు. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసి సూర్యాపేటకు సాగునీరు అందించాలని డిమాండ్‌ చేశారు. సుమారు 140 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పాలకులకు సోయి, కనీస అవగాహన లేక నీటిని ఎత్తిపోయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఎస్‌ఆర్‌ఎస్పీ ఫేస్-2కి నీళ్లు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రయోజనాలు పొందడంలేదన్నారు. లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రం పాలు చేస్తుందన్నారు. వరద పోయాక హడావుడి చేస్తే ప్రయోజనం ఉండదని.. ఒక్క ఎకరం ఎండినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు. రైతాంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, హెలికాఫ్టర్లలో విహారయాత్రలు మాని ప్రొజెక్టుల పర్యటనలు చేయాలని హితవు పలికారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం జీవో 33తో తెలంగాణ విద్యార్థులకు నష్టం జరుగుతుందని చెప్పారు. జీవోపై న్యాయ పోరాటానికి సైతం వెనుకాడమన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ ప్రమాదంలో పడిందన్నారు. పాత విధానాన్నే కొనసాగించాలని.. పాత బాసు(చంద్రబాబు)లను సంతృప్తి పరిచేందుకే రేవంత్‌ చేస్తున్న ప్రయత్నం ఇదని విమర్శించారు.