మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారు
విధాత, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రతినిధి: మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై 111 ఓట్ల తేడాతో నవీన్ కుమార్ రెడ్డి విజయం పొందారు. బాలుర జూనియర్ కళాశాలలో ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు రెండు గంటల్లో పూర్తి అయింది. 10.15 గంటలకే ఫలితం వెలువడింది. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే బీఆర్ఎస్ గట్టెక్కింది. మొత్తం 1437 ఓట్లు పోలవ్వగా 21 ఓట్లు చెల్లనవిగా అధికారులు గుర్తించారు. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డికి 763 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి 652 ఓట్లు వచ్చాయి. 111 మొదటి ప్రాధాన్యత ఓట్లతో నవీన్ కుమార్ రెడ్డి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు.