Site icon vidhaatha

KTR | నాడు కేసీఆర్‌ను విమర్శించారు..నేడు మీరు బహిష్కరిస్తున్నారు: కేటీఆర్‌

నీతి అయోగ్ బహిష్కరణపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి

విధాత, హైదరాబాద్ : నీతి అయోగ్‌ సమావేశ బహిష్కరణపై కాంగ్రెస్‌ పార్టీ ద్వంద్వ వైఖరిని కేటీఆర్ ట్విటర్ వేదికగా నిలదీశారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ప్రధాని మోదీతో సమావేశాన్ని నాడు కేసీఆర్‌ బాయ్‌కాట్‌ చేయడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తప్పుపట్టిందని, ఇరువురు కుమ్మక్కయ్యారని ఆరోపించిందని చెప్పారు. మరి ఇప్పుడు నీతి అయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాని రేవంత్‌ రెడ్డి స్వయంగా ప్రకటించడంపై కాంగ్రెస్‌ ఏం చెబుతుందని ప్రశ్నించారు. ప్రధాని మోదీని చోటే భాయ్‌ ఎందుకు కలవానుకోవడం లేదు?, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఎందుకు మాట్లాడాలని ఎందుకు అనుకోవడం లేదని ఎక్స్‌ వేదికగా నిలదీశారు.

తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న పక్షపాత వైఖరికి నిరసనగా నీతి అయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు అప్పట్లో సీఎం కేసీఆర్‌ ప్రకటిస్తే పీసీసీ అధ్యక్షునిగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి తప్పుపట్టారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానిని నిలదీయడానికి నీతి అయోగ్‌ సమావేశం ఒక మంచి అవకాశమని వాదించారు. ఆ సమావేశానికి సీఎం కేసీఆర్‌ వెళ్లాలని డిమాండ్‌ చేశారు. అదే రేవంత్‌రెడ్డి ఇప్పుడు సీఎంగా కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి నిరసనగా నీతి అయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు బుధవారం శాసనసభలో ప్రకటించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.

కేసీఆర్‌ అప్పుడు ఎందుకు బహిష్కరించారు

నీతి అయోగ్‌ సిఫారసులకు కేంద్రం విలువ ఇవ్వనప్పుడు ఆ సమావేశానికి వెళ్లడంలో అర్థం లేదనే బహిష్కరిస్తున్నట్టు రెండేండ్ల కిందట సీఎం కేసీఆర్‌ (ఆగస్టు 7, 2022)ప్రకటించారు. మిషన్‌ కాకతీయకు రూ.5 వేల కోట్ల గ్రాంట్‌, మిషన్‌ భగీరథకు రూ.19,500 కోట్ల గ్రాంట్‌ తెలంగాణకు ఇవ్వాలని నీతి అయోగ్‌ చేసిన సిఫారసును కేంద్రం పట్టించుకోకపోవడంతో.. నిరసనగా నీతిఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు కేసీఆర్‌ వివరించారు. కేంద్రం వైఖరిని తప్పుపట్టాల్సిందిపోయి అప్పుడు పీసీసీ అధ్యక్షునిగా ఉన్న రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ నిర్ణయాన్నే తప్పుపట్టారని తన ట్వీట్‌లో కేటీఆర్ గుర్తు చేశారు.

Exit mobile version