విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆరెస్ నేతల మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్ పవర్ ఫ్లాంట్ల నిర్మాణాలపై అవకతవకలపై సీఎం రేవంత్రెడ్డి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నియమించగా, కమిషన్ విచారణను తప్పుబడుతూ మాజీ సీఎం కేసీఆర్ 12పేజీల లేఖ రాశారు
అరెస్ట్ భయంతోనే కేసీఆర్ గగ్గోలు పెడుతున్నారన్న కాంగ్రెస్
మంగళవారం సమీక్షిస్తానన్న జస్టీస్ నరసింహారెడ్డి
విధాత: విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆరెస్ నేతల మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్ పవర్ ఫ్లాంట్ల నిర్మాణాలపై అవకతవకలపై సీఎం రేవంత్రెడ్డి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నియమించగా, కమిషన్ విచారణను తప్పుబడుతూ మాజీ సీఎం కేసీఆర్ 12పేజీల లేఖ రాశారు. చైర్మన్ బాధ్యతల నుంచి నరసింహారెడ్డిని తప్పుకోమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మాటలను తప్పుబడుతూ కాంగ్రెస్, బీజేపీ నేతలు, సమర్ధిస్తూ బీఆరెస్ నేతలు మాటల యుద్దం సాగిస్తున్నారు. ప్రజల కోసమే కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించగా, అరెస్ట్ భయంతోనే కేసీఆర్ గగ్గోలు పెడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. కాగా కేసీఆర్ ఇచ్చిన సమాధానంపై మంగళవారం సమీక్ష చేస్తానని కమిషన్ చైర్మన్ జస్టీస్ నరసింహారెడ్డి తెలిపారు. దీంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో రాజుకున్న విద్యుత్ మంటలు ఇప్పట్లో చల్లారే చూచనలు కనిపించడం లేదు.
మంగళవారం సమీక్ష చేస్తా
కేసీఆర్ లేఖపై జస్టిస్ నరసింహారెడ్డి కీలక వ్యాఖ్య
విధాత, హైదరాబాద్ : విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్ పవర్ ఫ్లాంట్ల నిర్మాణాల విషయంలో బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాసిన లేఖపై విద్యుత్తు కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి ఒక మీడియా చానల్తో స్పందించారు. కేసీఆర్ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారని, కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ చెప్పిన వివరాలకు వాస్తవాలకు సరిపోల్చాల్సి ఉందన్నారు. లేఖలో కేసీఆర్ పేర్కొన్న అంశాలపై నిపుణులతో చర్చిస్తానని, వాస్తవాలపై బీహెచ్ ఈఎల్ ప్రతినిధులని కూడా వివరాలు అడుగుతామన్నారు. కేసీఆర్ అభ్యంతరాలపై పునఃపరిశీలన చేస్తామన్నారు. కేసీఆర్ రాసిన లేఖపై మంగళవారం సమీక్ష నిర్వహించి, తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కేసీఆర్ లేఖపై జస్టిస్ నరసింహారెడ్డి తొలుత మీడియా సమావేశం నిర్వహించి కమిషన్ నుంచి తనను తప్పుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని భావించారు. అయితే కేసీఆర్ లేఖలో విద్యుత్తు కొనుగోలు, ఫ్లాంట్ల నిర్మాణంలో సాంకేతిక, న్యాయ పరమైన అంశాలను ప్రస్తావించడంతో పాటు కమిషన్ విచారణ నిష్పాక్షికంగా లేదని తన వృత్తి నిబద్ధతను, విధి నిర్వాహణలో తన నిజాయితీని ప్రశ్నించడంతో జస్టిస్ నరసింహారెడ్డి ఖిన్నులయ్యారు. మీడియా సమావేశాన్ని వాయిదా వేసుకున్న నరసింహరెడ్డి ఈ వివాదంలో కేసీఆర్కు ధీటైనా బదులివ్వాలని నిర్ణయించుకున్నట్లుగా, అందుకు తగిన కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది.
దొంగే పోలీసులను బెదిరించినట్లుగా కేసీఆర్ తీరు
అరెస్టుకు భయపడే గగ్గోలు
చైనాలో చేసి ఉంటే ఉరి తీసేవారు
కేసీఆర్ ప్రమేయంతోనే అన్ని శాఖల్లో స్కామ్లు
రామగుండంలో కాదని దామరచర్లలో ప్లాంట్ పెడతారా?
కేసీఆర్ ఆలోచన ఫలితం రూ.40 వేల కోట్ల భారం
కేసీఆర్ తీరుపై ఎమ్మెల్సీ జీవన్రెడ్డి..అద్దంకిల ఫైర్
కేసీఆర్ తీరు దొంగే పోలీసులను బెదిరించినట్లు ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి టి.జీవన్రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ లేఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవర్ కమిషన్ విచారణకు కేసీఆర్ సహకరించకపోవడం అంటే ఆయన నేరాన్ని అంగీకరించినట్టేనని తేల్చేశారు. పవర్ కమిషన్ చైర్మన్ను కేసీఆర్ నేరుగా భయపెడుతున్నారని ఫైర్ అయ్యారు. న్యాయ వ్యవస్థను కేసీఆర్ కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర, దక్షిణ తెలంగాణ అని కొత్త నాటకానికి తెర తీస్తున్నారని మండిపడ్డారు. రామగుండంలో కాదని దామర చర్లలో విద్యుత్ ప్లాంట్ పెడతారా…? అని ధ్వజమెత్తారు. అక్కడ నెలకొల్పడంతో బొగ్గు తరలింపు ఆర్థిక భారం కాదా అని నిలదీశారు. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడ్డారని మండిపడ్డారు. లేదంటే 3రూపాయలకే వచ్చే సోలార్ పవర్ గురించి ఎందుకు ఆలోచించలేదని నిలదీశారు. గత పదేళ్ల హయాంలో కేసీఆర్ చేయని తప్పు లేదని.. ఇవే తప్పులు చైనాలో చేసి ఉంటే ఉరి తీసేవారని విమర్శించారు. వివిధ ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ చేసిన ఆలోచన తప్పయ్యిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు.. దాంతో రూ.40 వేల కోట్ల ఆర్థిక భారం పడిందని వివరించారు. నరహింహారెడ్డి నివేదిక ఏం ఇస్తారోననే భయం కేసీఆర్లో నెలకొందని పేర్కొన్నారు. అందుకే ఏకపక్షంగా వాదిస్తున్నారని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకల గురించి కేసీఆర్కు తెలుసు అన్నారు. ఆ విషయంలో అరెస్ట్ అవుతానని కేసీఆర్ ముందే ఊహించారని.. అందుకే గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనూ కేసీఆర్ ఏకపక్షంగా వాదిస్తున్నారని గుర్తుచేశారు.
కేసీఆర్ ప్రమేయంతోనే అన్ని శాఖల్లో స్కాములు : అద్దంకి
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణలో తన పేరు ఉందని కేసీఆర్ బాధపడటంలో అర్ధం లేదని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ట్విటర్ ఎక్స్లో వీడియో విడుదల చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయంలో అన్ని శాఖల్లో కేసీఆర్ ప్రమేయంతోనే స్కామ్లు జరిగాయని ఆరోపించారు. తన పేరు బద్నాం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని కేసీఆర్ అనడం తప్పు అని కొట్టిపారేశారు. ఆయా శాఖల మంత్రుల ప్రమేయం లేకుండా అన్ని స్కామ్లు జరిగినట్లుగా విచారణలో తెలుస్తుందని స్పష్టం చేశారు.
విద్యుత్తు కొనుగోలు, ఫ్లాంట్ల నిర్మాణాల్లో ఎక్కడా నష్టం జరుగలేదు
విచారణకు సిద్ధమని పునరుద్ఘాటన
జస్టిస్ నరసింహారెడ్డి తన వ్యాఖ్యలతో విశ్వసనీయత కోల్పోయారు
వాదనలు వినకుండానే తీర్పునిచ్చారు
అందుకే కేసీఆర్ లేఖలో తప్పుకోమన్నారు
మాజీ విద్యుత్తు శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి స్పష్టీకరణ
విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి ఫ్లాంట్ల నిర్మాణతో తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడా నష్టం జరగలేదని, ఆ విషయంలో ఏ విచారణకైనా సిద్ధమని రాష్ట్ర మాజీ మంత్రి జగదీష్రెడ్డి పునరుద్ఘాటించారు. ఆదివారం తెలంగాణభవన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోమాట్లాడుతూ తమ హయాంలో జరిగిన విద్యుత్తు కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ఎంక్వయిరీ కమిషన్ వేసిందని, ఇప్పటికే ప్రభుత్వం లేవనెత్తిన సందేహాలకు అసెంబ్లీలో సమాధానం కూడా ఇచ్చామని, స్వేద పత్రాలు కూడా విడుదల చేశామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోనూ కాంగ్రెస్, బీజేపీ వాళ్లు విద్యుత్తు కొనుగోళ్లు, ఫ్లాంట్ల నిర్మాణలపై లేవనెత్తిన అనుమానాలను మేం ఆనాడు నివృత్తి చేశామని గుర్తు చేశారు. ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి టీడీపీ సభ్యుడిగా ఆనాడు లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే తెలంగాణ విద్యుత్తు సంస్థల ప్రతిపాదనలకు ఈఆర్సీ ఆమోదముద్ర వేసిందని తెలిపారు. నాడు ఈఆర్సీ నిర్ణయాలపై అభ్యంతరాలు, ఆక్షేపణలుంటే ఎలక్ట్రిసిటీ అప్పిలేట్ ట్రైబ్యునల్కు లేదా సుప్రీంకోర్టుకు రేవంత్రెడ్డి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.
కమిషన్ సందేహాలకు కేసీఆర్ సమాధానం ఇచ్చారని, అదే సమయంలో కమిషన్ పాత్రపైన, వారి మాటలపైన అభ్యంతరం వ్యక్తం చేశారని స్పష్టం చేశారు. పవర్ కమిషన్ వాదన వినకముందే తీర్పునిచ్చే తీరుగా వ్యవహారించిందని, కమిషన్ ఉద్దేశం వేరేలా ఉందని, అందుకే నరసింహారెడ్డికి అర్హత లేదని, కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని సూచించారని, అన్ని ఆధారాలు కేసీఆర్ చూపించారని జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ లేఖలో పేర్కోన్న అంశాలు వందశాతం నిజమని, అది వారి హక్కు అని, మాజీ సీఎంగా ఆ విషయాలన్ని ప్రజలకు తెలిపారన్నారు. వివరణ ఇచ్చేందుకు ఈ నెల 30 వరకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ అడిగితే ఇవ్వలేదని, 15 లోపే వివరణ ఇవ్వాలన్నారని, అంతకుముందే 11వ తేదీన నరసింహారెడ్డి మీడియా ముందు కేసీఆర్పై పలు వ్యాఖ్యలు చేయడం విచారకరమన్నారు. జస్టిస్ నరసింహారెడ్డి అంటే మాకు గౌరవం ఉండేదని, ప్రభుత్వం మారిపోయక ఆయన కూడా మారిపోయారని జగదీశ్రెడ్డి వ్యాఖ్యానించారు.
చీకట్లో ఉన్న తెలంగాణను వెలుగుల తెలంగాణగా మార్చిన కేసీఆర్పై ఆయన సానుభూతి ఉంటుందనుకున్నామని, కానీ ఆయన తీరు అలా లేదని జగదీశ్రెడ్డి ఆక్షేపించారు. విచారణ పూర్తి కాకముందే జడ్జిమెంట్ ఇచ్చినట్లుగా నరసింహారెడ్డి మీడియా ముందు వ్యాఖ్యలు చేశారని జగదీశ్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిషన్లను గతంలో అనేక ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయని, అనుమానాలున్నప్పుడు తప్పుకున్నారని, కొన్ని రద్దయ్యాయని గుర్తు చేశారు. నిజానికి ఈఆర్సీలకు వ్యతిరేకంగా విచారణ కమిషన్లు ఏర్పాటు చేయరాదని జస్టిస్ నరసింహారెడ్డికి ఎందుకు ప్రభుత్వానికి చెప్పలేదో తెలియడం లేదన్నారు. అయినప్పటికి మేం దానిపై మాట్లాడలేదని, విచారణకు సహకరిస్తునే వచ్చామన్నారు. అయితే నరసింహారెడ్డి కమిషన్ ముందుగానే విద్యుత్తు కొనుగోలు, ఫ్లాంట్ల నిర్మాణాలపై నష్టాలు వాటిల్లినట్లుగా చేసిన వ్యాఖ్యలతో ఆయన విచారణపై తమకు విశ్వాసం పోయిందన్నారు. అందుకే కమిషన్ బాధ్యతల నుంచి ఆయన తప్పుకోవాలని కేసీఆర్ కోరారని, ఆయన తప్పుకుంటారని మేం భావిస్తున్నామన్నారు.