నడిగడ్డను ఆగం పట్టించిందే కాంగ్రెస్ : సీఎం కేసీఆర్

కృష్ణా, తుంగభద్ర అనే రెండు నదుల మధ్య ఉన్న నడిగడ్డను కూడా ఆగం పట్టించారు కాంగ్రెస్ నాయకులు. ఆర్డీఎస్ ఆగం పట్టించిన పార్టీ ఎవరిది..? ఆ చరిత్ర కూడా మీ ముందున్నది. ఆనాడు కరువుతో ఏడ్సినం. ఇక తప్పదు అని చెప్పి.. నేను ఉద్యమం మొదలుపెడితే పిడికెడు మందిమి ఉన్నప్పటికీ నా వెంట మీరంతా నడిచారు. అందరం కలిసి పులిబిడ్డల్లాగా లేచి కొట్లాడితే.. 2004లో తెలంగాణ ఇస్తామని మాటిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
పొత్తుతో ఇక్కడ, ఢిల్లీలో గెలిచారు. కాంగ్రెస్ నేతృత్వంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ రాష్ట్రాన్ని ఇవ్వలేదు. ఇవ్వకపోగా అనేక కథలు పడ్డారు. టీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు. ఉద్యమాన్ని మలినం పట్టించే ప్రయత్నం చేశారు.
చివరకు మంటరేగి కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆమరణ దీక్ష పడితే మీరంతా ఎక్కడివారు అక్కడ పులిబిడ్డల్లాగా కొట్లాడితే అప్పుడు దిగొచ్చి ప్రకనట చేశారు. మళ్లీ బ్రహ్మాండంగా కొట్లాడితే చిట్టచివరి దశలో తెలంగాణ ఇచ్చారు. ఇందతా చరిత్ర ఆలోచించాలి.
నాటి ఉమ్మడి పాలమూరు జిల్లా నాయకులు నీళ్ల గురించి కొట్లాడలేదు. రఘువీరారెడ్డి వస్తే మంగళహారతి పట్టి అనంతపురం దాకా నీళ్లు తీసుకువెళ్లమని హారతులు పట్టారు. వాళ్లచరిత్ర ఏందో మీకు తెలుసు. కృష్ణమోహన్ రెడ్డి ఏం చేసిండో.. ఆ చరిత్ర మీ ముందే ఉంది. గతంలో నెట్టెంపాడు కింద 20 వేల ఎకరాలు పారలేదు. ఇవాళ లక్ష 60 వేల ఎకరాలు పారుతుంది. రేలంపాడు రిజర్వాయర్ పెద్దగా చేసి నీళ్లు తీసుకుపోతే గద్వాల పచ్చబడ్డది. గట్టు మండలానికి నీళ్లు కావాలని గట్టు ఎత్తిపోతల పథకం కూడా తెచ్చాం.
పనులు జోరుగా జరుగుతున్నాయి. జిల్లా కేంద్రం చేసుకున్నాం. కలెక్టరేట్ కట్టుకున్నాం. అన్నిరకాలుగా గద్వాల అభివృద్ధి చెందింది. కృష్ణమోహన్ రెడ్డిని దీవించాలని కోరుతున్నాను. గద్వాలలో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ వచ్చింది. 300 పడకల ఆస్పత్రి నిర్మాణం జరుగుతోంది. సెంట్రల్ లైటింగ్ చేసుకున్నాం. కొత్త బస్టాండ్ చేసుకున్నాం. జూరాల వద్ద అద్భుతమైన గార్డెన్ చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. పేదల సంక్షేమం చేశారు.
ఈ నియోజకవర్గంలో వాల్మీకి బోయ సోదరులు ఉంటారు. ఆంధ్రాలో ఎస్టీలు, మన వద్ద బీసీలు, రెండు సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాం. మోదీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. బహుషా యుద్ధం చేయాల్సి వస్తదేమో. వాల్మికీ బోయల కొంపముంచింది.. ఏపీ మొదటి సీఎం నీలం సంజీవరెడ్డి. వాళ్లను ఆంధ్రాలో ఎస్టీలు పెట్టి, ఇక్కడ బీసీల కింద పెట్టింది. ఈ చరిత్ర కూడా తెలుసుకుని, ఆలోచించి ఓటేయాతొ.
‘ప్రపంచంలో ఉండే అష్టాదశ శక్తి పీఠాల్లో మన జోగులాంబ తల్లి దేవాలయం ఓ శక్తిపీఠం. అందుకే జిల్లాకు జోగులాంబ గద్వాల జిల్లా అని పేరుపెట్టుకున్నాం. జిల్లా పేరు అనుకున్నప్పుడుల్లా అమ్మవారిని స్మరించుకున్నట్లు అవుతుందని ఆ పేరు పెట్టుకున్నాం. గద్వాల చరిత్ర చాలా గొప్పది. ఈ గద్వాల ఊరుపేరే బయటి ప్రపంచంలో మాట్లాడితే విద్వత్ గద్వాల అని మాట్లాడేది. ప్రసిద్ధిగాంచిన తిరుపతి వెంకటకవులను ఈ సంస్థానంలో సన్మానించిన ఘనత చరిత్ర ఉన్నది గద్వాల. ఇంత వరకు బాగేనే ఉంది. గద్వాలను గబ్బుపట్టించిన గబ్బుపట్టించిన గబ్బునాయాళ్లు ఎవరు? .
‘నేను ఒక్కటే మనవి చేస్తున్నా. ఎలక్షన్లు వస్తయ్ పోతయ్. ఎట్ల 30 తారీఖున ఓట్లు పడుతయ్ ఎవరో ఒకరు గెలవాలి. ఇది జరిగేదే. మూడు పార్టీల నుంచి ముగ్గురు నిలబడుతరు. ఇంకా ఎవరైనా ఇండిపెండెంట్గా ఉంటరు కావొచ్చు. బీఆర్ఎస్ తరఫున మన కృష్ణమోహన్రెడ్డి ఉన్నడు. కాంగ్రెస్కు ఎవరో ఒకాయన ఉంటడు. బీజేపీకి ఎవరో ఒకరు వస్తరు. ఇక్కడ నిలబడ్డ అభ్యర్థుల గుణం, గణం చూడాలి. ఎలాంటి వ్యక్తులు, మంచేంది.. చెడేంది అన్నది చూడాలి. అన్నింటికన్నా ముఖ్యంగా పార్టీలు ఉన్నయ్. కృష్ణమోహన్రెడ్డి వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ అభ్యర్థి వెనుక కాంగ్రెస్ ఉంటుంది. బీజేపీ అభ్యర్థి వెనుక బీజేపీ ఉంటది’
‘ఆ పార్టీల చరిత్రను ప్రజలు చూడాలి. ప్రజాస్వామ్యంలో ఆ పరిణితి, విచక్షణా జ్ఞానం ఓటర్లకు రావాలి. ఆ పార్టీ నడవడిక ఎలాంటిది ? రైతుల గురించి ఏం చేస్తారు ? పేద ప్రజల గురించి ఏం చేస్తారు ? ఏం ఆలోచన చేస్తారు ? రాష్ట్రాన్ని ప్రగతిపథంలో తీసుకుపోయేందుకు ఏం వ్యూహాలు చేస్తారు ? అనే ఆలోచన చేయాలి. పార్టీల చరిత్రలన్నీ మీ ముందున్నయ్. కాంగ్రెస్ పార్టీ ఎన్ని దశాబ్దాలు పరిపాలించిందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చరిత్రంతా మీకు తెలుసు. బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలన ఎలా ఉందో.. ఈ పార్టీ ఎందుకు పుట్టిందో మీకు తెలుసు. రెండు విషయాలను చూద్దాం. కృష్ణా, తుంగభద్ర ఉండే నడిగడ్డ ప్రాంతాన్ని ఎటుగాకుండా ఆగం చేసి కరువు పాలు చేసిన పార్టీ ఏదీ ? దయచేసి చరిత్రను చూడాలి’.
మనం గొడగొడ ఏడ్చుకుంటూ వలసలు పోయిననాడు కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎవరైనా జై తెలంగాణ అన్నాడా..? మన చెవులతో విన్నామా..? మనం జై తెలంగాణ అంటే మనల్ని జైల్లో వేశారు. చంపిండ్రు, కొట్టిండ్రు, లాఠీ చార్జి చేసిండ్రు. అనేక కేసులు పెట్టిండ్రు. వాళ్లు ఎవ్వడు జై తెలంగాణ అనలేదు. వాళ్లకు కడుపునొప్పి ఎందుకు ఉంటది. ఇప్పుడు తెలంగాణ పచ్చబడ్డది కాబట్టి.. మళ్లా కరుగనాకాలి. మళ్లీ ప్రజల గుండు కొట్టాలి. దానికోసం వాళ్ల ఆరాటం తప్ప తెలంగాణ బతుకుల కోసం కాదు. ఏ మాత్రం పోరాపాటు చేసిన ఇబ్బందులు వస్తాయి. దయచేసి ఆలోచించి కృష్ణమోహన్ రెడ్డికి ఓటేయండి.. గతం కంటే 10 వేల మెజార్టీతో గెలిపించండి.