కోనాయిప‌ల్లి వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్న కేసీఆర్.. నామినేష‌న్ ప‌త్రాల‌పై సీఎం సంత‌కాలు

కోనాయిపల్లి శ్రీ వెంకటే్‌శ్వర స్వామి పాదాల వద్ద నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించిన సీఎం కేసీఆర్‌..1985నుంచి కొనసాగిస్తున్న సెంటిమెంట్‌

కోనాయిప‌ల్లి వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్న కేసీఆర్.. నామినేష‌న్ ప‌త్రాల‌పై సీఎం సంత‌కాలు

బీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని కోనాయిప‌ల్లి వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని శ‌నివారం మ‌ధ్యాహ్నం ద‌ర్శించుకుని, ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ముచ్చ‌ట‌గా మూడోసారి ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిష్టించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న కేసీఆర్.. వెంక‌న్న స‌న్నిధిలోనే నామినేష‌న్ ప‌త్రాల‌పై సంత‌కాలు చేసి, త‌న సెంటిమెంట్‌ను కొనసాగించారు. అంత‌కంటే ముందు ఆల‌య ప్ర‌ద‌క్షిణ చేశారు కేసీఆర్. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి హ‌రీశ్‌రావుతో పాటు ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు.


శ‌నివారం మ‌ధ్యాహ్నం ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న కేసీఆర్‌కు హ‌రీశ్‌రావు స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం అర్చకులు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికి, మంగ‌ళ‌వాయిద్యాల మ‌ధ్య ఆల‌యంలోకి తీసుకెళ్లారు. నామినేష‌న్ ప‌త్రాల‌తో ప్ర‌త్యేక పూజ‌ల అనంత‌రం ఆలయ పండితులు కేసీఆర్‌కు వేదాశీర్వచనం అందించారు. ఎన్నికల్లో నామినేషన్‌ వేసే ప్రతిసారి కేసీఆర్‌ ఈ ఆలయంలో పూజలు చేస్తూ వస్తున్నారు. ఈ నెల 9న గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో నామినేషన్లు వేయనున్నారు. అదేరోజు బీఆర్‌ఎస్‌ ఆశీర్వాదసభల్లో పాల్గొననున్నారు.


కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం సీఎం కేసీఆర్‌, పార్టీకి సెంటిమెంట్‌గా ఉంది. ఏ ఎన్నికలు వచ్చినా ఇక్క డ పూజలు చేసిన తర్వాతే సీఎం కేసీఆర్‌ నామినేషన్ వేయ‌డం ఆన‌వాయితీగా వస్తోంది. కోనాయిపల్లి వెంకన్నకు పూజలు చేసిన ప్రతిసారి సీఎం కేసీఆర్‌ కేసీఆర్‌కు విజయం వరించింది. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి 1989, 1994, 1999, 2001, 2004, 2009, 2014, 2018లో జరిగిన ఎన్నికల సమయంలో ఈ ఆలయంలో నామినేషన్‌ పత్రాలకు పూజలు చేసి, నామినేషన్‌ వేశారు. అన్ని సందర్భాల్లోనూ విజయం సాధించారు. మరో విశేషం ఏమిటంటే, 2001లో టీడీపీకి, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన కేసీఆర్‌.. ఆ తర్వాత ఈ ఆలయంలోనే పూజలు చేసి టీఆర్‌ఎస్‌ పార్టీని ప్రకటించారు.