ఏరోస్పేస్ హబ్ గా తెలంగాణ : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ దేశంలో ఏరోస్పేస్ హబ్గా అవతరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో అభివృద్ధి చేసిన విక్రం-1 రాకెట్ను శ్రీహరికోటకు పంపించారు.
విధాత, హైదరాబాద్ : దేశంలో ఏరోస్పేస్ హబ్ గా తెలంగాణ అవతరించనుందని, రాష్ట్రం ఏరోస్పేస్ రంగంలో అగ్రగామిగా నిలిచేందుకు ప్రజా ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ హైదరాబాద్ నగరంలోనే రూపకల్పన చేసి, అభివృద్ధి చేసిన ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1ను శ్రీహరికోటకు సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబుతో కలిపి జెండా ఊపి శనివారం ఆయన ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ప్రయోగ స్థలానికి రాకెట్ లాంఛనంగా బయలుదేరింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…భారతదేశపు మొట్టమొదటి ప్రైవేటు ఆర్బిటల్ ప్రయోగ ప్రయత్నం చేయడానికి స్కైరూట్ సిద్ధంగా ఉండటం హర్షణీయం అన్నారు.
రాబోయే నెలల్లో భారతదేశపు మొట్టమొదటి ప్రైవేటు ఆర్బిటల్ ప్రయోగానికి స్కైరూట్ సిద్ధమవనుందని, ఇందుకు కృషి చేసిన స్కైరూట్ బృందాన్నిప్రశంసిస్తున్నామన్నారు. ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకువెళ్లేందుకు భారతదేశపు మొట్టమొదటి ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్ను స్కైరూట్ హైదరాబాద్ లో అభివృద్ధి చేయడం ఏరోస్పేస్ రంగంలో ఈ రాష్ట్ర వృద్ధికి ఇదొక మైలురాయి అని అభివర్ణించారు. ఈ సంస్థ 2022లో తన తొలి రాకెట్ను ప్రయోగించిందని, అయితే, ఇంత తక్కువ సమయంలోనే ఆర్బిటల్ ప్రయోగ దశకు చేరుకోవడం హర్షణీయమన్నారు.
దేశంలోనే ఏరోస్పేస్ రంగంతో తెలంగాణ ప్రథమ స్థానం
ఏరోస్పేస్ రంగంలో తెలంగాణ భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బోయింగ్, ఎయిర్బస్, సాఫ్రాన్ వంటి ప్రపంచ స్థాయి దిగ్గజాలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఉన్నాయన్నారు.
2047 నాటికి ఏరోస్పేస్ రంగంలో ప్రపంచ అగ్రగామిగా నిలవాలన్నది తెలంగాణ లక్ష్యమని సీఎం రేవంత్ తెలిపారు. ఏరోస్పేస్ రంగాన్ని ఒక కీలక వృద్ధి రంగంగా తమ ప్రభుత్వం పరిగణిస్తున్నట్టు వివరించారు. డిసెంబర్ 2023 నుంచి ఇంజనీరింగ్ ఎగుమతుల్లో తెలంగాణ అసాధారణ వృద్ధి నమోదు చేసిందన్నారు.
ఎగుమతుల్లో రక్షణ పరికరాల వాటనే అధికం
కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2023-24, 2024-25 మధ్యలో దేశంలోనే ఇంజనీరింగ్ ఎగుమతుల్లో తెలంగాణ 117.9% అత్యధిక వృద్ధిని నమోదు చేసిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అయితే ఈ వృద్ధికి విమాన విడిభాగాలు, రక్షణ పరికరాలే ప్రధానంగా దోహద పడ్డాయన్నారు.
ప్రపంచ విశ్వవిద్యాలయాలు, పారిశ్రామిక దిగ్గజాలతో భాగస్వామ్యాల ద్వారా ఏరోస్పేస్ రంగం అవసరాల కోసం యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన చర్యలపై తమ ప్రజా ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్నారు. అందుకు అవసరమైన విధానాలు, మౌలిక సదుపాయాలు, ప్రతిభతో స్కైరూట్ వంటి కంపెనీలకు మద్దతు ఇవ్వడానికి తమ ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు.
నైపుణ్య శిక్షణలను అభివృద్ధి చేస్తాం
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రతిభావంతులకు నైపుణ్య శిక్షణ ఇస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీలు) త్వరలో ఉన్నతీకరించబడనున్న పాలిటెక్నిక్ కళాశాలల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను ఆయన వివరించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా, ఏటీసీలను, పాలిటెక్నిక్ కళాశాలలు, రెండింటినీ స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువస్తామన్నారు.
ఈ సంస్థల్లో శిక్షకులకు అత్యుత్తమ శిక్షణ ఇవ్వడంపైనే తాము దృష్టి కేంద్రీకరించినట్టు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏటీసీల్లో సిబ్బందికి టాటా టెక్నాలజీస్ ఇప్పటికే శిక్షణ అందిస్తున్నట్టు వివరించారు.
స్కిల్ యూనివర్సిటీ ప్రయోజకరం..
సీఎం రేవంత్ రెడ్డి సూచనకు స్పందనగా… స్కైరూట్ ఏరోస్పేస్ సీఈఓ, కోఫౌండర్ పవన్ కుమార్ చందన, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో కలిసి పనిచేయడానికి ఆసక్తిని వ్యక్తం చేశారు. స్కిల్స్ యూనివర్సిటీ ఆలోచన ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా తమకు అవసరమైన ప్రతిభావంతులు దొరకడం సుగమం అవుతుందని పవన్ కుమార్ అన్నారు. పరిశ్రమలుగా తాము ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నైపుణ్యత, శిక్షణే అని ఆయన చెప్పారు. స్కిల్స్ యూనివర్సిటీతో భాగస్వామ్యం కావడం తమకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.
ఏటీసీ సందర్శించాలని కోరిన సీఎం
ఇక హైదరాబాద్లోని మల్లేపల్లిలో ఉన్న ఏటీసీను సందర్శించాల్సిందిగా ముఖ్యమంత్రి స్కైరూట్ సంస్థను ఆహ్వానించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు పాఠ్యప్రణాళికను మార్చడంలో స్కిల్స్ యూనివర్సిటీ కల్పిస్తున్న వెసులుబాటును ఆయన సందర్భంగా గుర్తు చేశారు.
ఇక రాష్ట్ర పాఠశాల విద్యా వ్యవస్థలోని లోపాలను పరిష్కరించడానికి ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికల గురించి కూడా సీఎం ప్రస్తావించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థిపై సంవత్సరానికి రూ. 1.08 లక్షలు ఖర్చు చేస్తున్నప్పటికీ, ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడం లేదని ఆయన అన్నారు. దీనిని పరిష్కరించడానికి తాము ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి బి. అజిత్ రెడ్డి, స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు, సీఓఓ నాగ భరత్ డాకా, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
అజారుద్దీన్, కోదండరామ్ ల ఎమ్మెల్సీలకు గవర్నర్ ఆమోదం
RTC Strike | 12 గంటల చర్చలు సఫలం.. రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram