CM Revanth Reddy | హైదరాబాద్ సమస్యల పరిష్కారానికే హైడ్రా: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ నగరంలో సమస్యల పరిష్కారానికి, విపత్తుల నిర్వహణకు హైడ్రా అనే నూతన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు

  • By: Somu |    telangana |    Published on : Jul 20, 2024 2:54 PM IST
CM Revanth Reddy | హైదరాబాద్ సమస్యల పరిష్కారానికే హైడ్రా: సీఎం రేవంత్‌రెడ్డి

లండన్ థెమ్స్‌లా మూసీ సుందరీకరణ
ప్రపంచ పర్యాటక కేంద్రంగా మూసీ
లక్షన్నర కోట్లతో ప్రక్షాళన
గోపన్ పల్లి ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి

విధాత : హైదరాబాద్ నగరంలో సమస్యల పరిష్కారానికి, విపత్తుల నిర్వహణకు హైడ్రా అనే నూతన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. శనివారం గోపన్‌పల్లి ఫ్లైఓవర్‌ను మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీలతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఉమెన్ బైకర్‌లను అనుమతించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ గోపన పల్లి ఫ్లైఓవర్ ద్వారా శేరిలింగంపల్లి అభివృద్ధి చెందుతుందని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. లండన్ థెమ్స్ నదిలా మూసీ నదిని లక్షన్నర కోట్లతో సుందరీకరించబోతున్నామన్నారు. మూసీ రివర్ డెవలప్మెంట్ కు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అందుకు త్వరలోనే ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు.

హైదరాబాద్ ను విశ్వనగరంగా అభివృద్ధి చేసుకోవడమే మన ముందున్న లక్ష్యమని తెలిపారు. ప్రస్తుతం మూసీ అంటే ముక్కు మూసుకునే పరిస్థితి నెలకొందన్నారు. రాబోయే ఐదేళ్లలో ప్రపంచ పర్యాటకులు సందర్శించేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మూసీ అభివృద్ధి చూడగానే ప్రజా ప్రభుత్వం గుర్తొచ్చేలా తీర్చిదిద్దుతామని, హైదరాబాద్ అభివృద్ధిలో మీరంతా భాగస్వాములు కావాలన్నారు. వచ్చే పదేళ్లలో హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి మీ అందరి సహకారం ఉండాలని కోరుతున్నానని తెలిపారు. తెలంగాణకు 65 శాతం ఆదాయం జంట నగరాల నుంచే వస్తోందని, హైదరాబాద్‌కు ఎవరు వచ్చినా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, దేశం నలుమూలల నుంచి ఎవరు వచ్చినా అక్కున చేర్చుకుంటున్నామన్నారు. గోపన్ పల్లిలో ఎకరం రూ.100 కోట్లు పలుకుతోందని, ఇక్కడికి వచ్చిన ఐటీ, ఫార్మా సంస్థల వల్ల భూమి ధర పెరిగిందని సీఎం తెలిపారు.