కురుమూర్తి స్వామి సాక్షిగా రుణ మాఫీ చేస్తా...గజ్వేల్ కేడీ వచ్చినా, ఢిల్లీ మోడీ వచ్చినా పాలమూరులో గెలుపు కాంగ్రెస్ దే : సీఎం రేవంత్ రెడ్డి
అరుణమ్మతో గెట్టు పంచాయతీ లేదు
కురుమూర్తి స్వామి సాక్షిగా రుణ మాఫీ చేస్తా
విధాత: నా జన్మంతా ఈ ప్రాంతానికి సేవ చేసినా మీ రుణం తీరదని, మీ ఆశీర్వాదంతోనే ఈ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానని సీఎం ఎ.రేవంత్ రెడ్డి. వనపర్తి జిల్లా కొత్తకోట కార్నర్ మీటింగ్లో మాట్లాడుతూ.. గజ్వేల్ నుంచి కేడీ వచ్చినా.. ఢిల్లీ నుంచి నరేంద్ర మోదీ వచ్చినా పాలమూరులో కాంగ్రెస్ ను ఓడించలేరన్నారు. అమెరికాలో చదువుకునో, వారసత్వ రాజకీయలతోనో నేను మీ ముందుకు ముఖ్యమంత్రిగా రాలేదు, వనపర్తి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో చదువుకొని వచ్చానన్నారు. ఆనాడు జి.చిన్నారెడ్డి గెలుపు కోసం రాతలు రాసినవాన్నని తెలిపారు. మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యి 150 రోజులు కాకముందే.. కొందరు దిగిపో.. దిగిపో అంటున్నారు. ఈ పాలమూరు బిడ్డను ముఖ్యమంత్రి పదవి నుంచి దించడానికి ఢిల్లీ నుంచి గొడ్డలి తీసుకుని బయలుదేరారన్నారు. డీకే అరుణమ్మ కాంగ్రెస్ ను ఓడించాలంటుంది, ఆమెకు ఇంత పేరు తెచ్చిపెట్టింది కాంగ్రెస్ కాదా అని ఆయన ప్రశ్నించారు. మాదిగల ఏబీసీడీ వర్గీకరణ కోసం ఢిల్లీలో మాట్లాడేవారు ఉండాలన్నా, ముదిరాజు సోదరులను బీసీ డీ నుంచి ఏ గా మార్చేందుకు, వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్పించేందుకు, సుప్రీంకోర్టులో సమస్యలు పరిష్కరించేందుకు ఇక్కడి నుంచి చల్లా వంశీ చంద్ రెడ్డి గెలవాలన్నారు. ప్రాజెక్టులు రిపేర్లు చేయాలన్న ఆలోచన అరుణమ్మ ఏనాడైనా చేశారా అని విమర్శించారు.
రేవంత్ రెడ్డి నాపై పగ పట్టారని అరుణమ్మ అంటుంది, ఆమెకు నాకు ఏమైనా గెట్టు పంచాయితీ ఉందా? నన్ను పడగొట్టేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పైరవి చేసి కేసులు పెట్టించిందని ఆరోపించారు. ఇక్కడ కల్తీ కల్లు, సారా, క్రషర్ దందాలు చేసేవాళ్లు నన్ను బెదిరించి నాది తప్పు అంటున్నారన్నారు. కురుమూర్తి స్వామి సాక్షిగా పంద్రాగస్టులోగా రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసి పాలమూరు రైతుల రుణం తీర్చుకుంటానని, రైతుల రుణం తీర్చుకోకపోతే నా జన్మ వృథా అన్నారు. పాలమూరు జిల్లాలో బీజేపీని పాతరేయాలి వంశీ చంద్ రెడ్డిని ఒక లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రజలను రేవంత్ రెడ్డి కోరారు.